ఇంఫాల్ : మణిపూర్లో మే 4న ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ప్రాంతంలోని ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. తౌబాల్ జిల్లా నాంగ్పాక్ సెక్మారు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి, మరో నలుగురు పోలీసులను సస్పెండ్ చేయాలని మణిపూర్ పోలీసు శాఖ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 3న బిష్ణుపూర్ జిల్లా నరన్సీనాలో ఉన్న 2వ ఇండియా రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్బి) ప్రధాన కార్యాలయం నుంచి ఆయుధాలు, 19 వేల బుల్లెట్లు దోపిడీ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఆధ్వర్యంలో ఆరు వారాల కాలపరిమితితో కూడిన విచారణకు రాష్ట్ర పోలీసులు ఆదేశించినట్లు చెప్పారు.