సర్పంచ్ ఎన్నికలకు సై..

Sarpanch Election Sy..– ఓటరు జాబితా సిద్ధం చేయాలని  ఆదేశాలు
– మాస్టర్ ట్రైనర్లను పంపించాలని ఎస్ఈసీ ఉత్తర్వులు
– రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ..
– పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి
నవతెలంగాణ – మల్హర్ రావు
సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరి 31తో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. జీపీలకు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేపట్టిం ది. తాజాగా ఆ శాఖ ఉన్నతాధికారులు, బీసీ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారంలోపు సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో శిక్షణ అందించేం దుకు జిల్లా నుంచి ఐదుగురు డాటా ఎంట్రీ ఆపరే టర్లను (మాస్టర్ ట్రైనర్లు)గా ఎంపిక చేసి హైద రాబాద్ కు పంపించాలని ఎస్ఈసీ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి షూరు కానుంది. పోటీకి సై అంటున్న ఆశావాహుల్లో సర్కారు నిర్ణయం ఆనందం కలిగిస్తోంది.
మండలంలో ఇదీ పరిస్థితి..
మండలంలో 15 గ్రామ పంచాయతీలుండగా వాటి పరిధిలో 128 వార్డులున్నాయి. వీటికి 2018లో ఎన్నికలు నిర్వహించగా ఈ ఏడాది జనవరి 31తో పాలకవర్గాల గడువు ముగిసింది.జిపిలు గడువు ఈ ఏడాది జనవరిలో స్పెషల్ ఆపిసర్ల  పాలన కొనసాగుతున్న విషయం విదితమే. పంచాయతీలకు ఆరు నెలల పాటు పాలకవర్గాలు లేనట్లైతే కేంద్రం నుంచి అందాల్సిన  నిధుల విడుదల నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిదులు అందక పంచాయతీల్లో ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో జీపీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభు త్వం భావిస్తోంది. అవసరమైన కసరత్తు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించింది.
ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టి..
సచివాలయంలో తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి పంచాయతీ ఎన్ని కల ప్రక్రియ నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు మొదటి వారంలోపు గ్రామ, వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ సైతం ఆలోపు చేపట్టాలని సూచించారు. సీఎం ఆదేశాలకను గుణంగా జిల్లాల్లోని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ అందించేందుకు వీలుగా జిల్లా నుంచి ఐదుగురు డాటా ఎంట్రీ ఆపరేటర్లను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేసి వారి వివరాలు సంపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన మాస్టర్ ట్రైనర్లకు ఆగస్టు 2వ తేదీన ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇటీవల జరిగిన పార్ల మెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారం గ్రామాల్లో ఓటరు జాబితాలను ప్రకటించి వార్డుల వారీగా సిద్ధం చేయనున్నారు. పంచాయతీ ఓటర్లు 650 లోపు ఉన్నట్లైతే ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నారు. 200 మందికి రెండు, 400 మందికి మూడు, 400-650 మందికి నాలుగు, 650కి మించితే మరో అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. గతంతో పోల్చితే వార్డు స్థానాల సంఖ్య పెరిగే అవ కాశముందని అధికారులు చెబుతున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ..
ఓటర్ల జాబితా సిద్ధమయ్యాక రిజర్వేషన్ల ఖరారు, బ్యాలెట్ బాక్స్ లు, పోలింగ్ సిబ్బంది వంటి ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. అయితే రిజర్వే షన్లకు సంబంధించి బీసీ కమిషన్ నిర్దిష్ట గడువు ఎంచుకొని ఆ లోపు నివేదిక అందించాలని సీఎం ఆదే శించారు. అయితే బీసీల కులగణన ఆధారంగా రిజిర్వేషన్లు ఖరారు చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశముండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా లేక రిజర్వేషన్లు మారుస్తారా అనే దానిపై ఆశావహులతో పాటు రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దీనిపై స్పష్టత నిచ్చే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు పల్లెల్లో సందడి మొదలైంది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.