టార్గెట్‌ ప్రకాశ్‌రాజ్‌ ఈడీ నోటీసులు

టార్గెట్‌ ప్రకాశ్‌రాజ్‌ ఈడీ నోటీసులు–  పోంజీ స్కీమ్‌ కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : నగల వ్యాపారంతో ముడిపడి ఉన్న రూ.100 కోట్ల పోంజీ స్కీమ్‌లో నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కోసం సమన్లు పంపింది. కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈ స్కీమ్‌ను నడుపుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొం టున్న తమిళనాడు లోని తిరుచ్చికి చెందిన ప్రణవ్‌ జ్యువెలర్స్‌కు ప్రకాశ్‌రాజ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. పోంజీ స్కీమ్‌లో రూ. 100 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణ లతో చెన్నైతో సహా తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో శాఖలను కలిగి ఉన్న ఆభరణాల గొలుసు శాఖలు, యజమానుల ఇండ్లపై ఈడీ దాడులు చేసింది. ఈ నగల వ్యాపారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఈ విషయంపై ఇంకా ప్రకటన ఇవ్వలేదు.
ప్రణవ్‌ జ్యువెలర్స్‌ నిర్వహిస్తున్న దుకాణాలు అక్టోబర్‌లో మూసివేయబ డ్డాయి. ఫిర్యాదుల ఆధారంగా తమిళనాడులోని తిరుచ్చిలో జ్యువెలర్స్‌ యజమాని మధన్‌పై కేసు నమోదైంది. ఈ నెల ప్రారంభంలో యజమాని, అతని భార్యపై లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేయబడ్డాయి. ప్రణవ్‌ జ్యువెలర్స్‌ అధిక రాబడిని అందించే గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌ పేరుతో రూ.100 కోట్లు వసూలు చేసిందని రెండ్రోజుల క్రితం ఈడీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. రాబడులు కార్యరూపం దాల్చకపోవడమే కాకుండా, ఇన్వెస్ట్‌ చేసిన మొత్తాన్ని కూడా పెట్టుబడిదారులకు తిరిగి ఇవ్వలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
నటుడు ప్రకాశ్‌రాజ్‌ గత కొన్నేండ్లుగా కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపస్తున్నారు. మోడీ సర్కారు విధానాలను అనేక సందర్భాల్లో ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ప్రకాశ్‌రాజ్‌ను టార్గెట్‌ చేయటం గమనార్హమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.