క్రీడా పాలసీ వల్లే క్రీడల్లో తెలంగాణ నెంబర్‌ 1

– అమెరికాలో జరిగే ప్రపంచ కరాటే ఛాంపియన్‌ ఫిప్‌కు ఎంపిక
– క్రీడాకారులను అభినందింనలు
– మంత్రి డా. వి శ్రీనివాస్‌ గౌడ్‌
నవ తెలంగాణ- మహబూబ్‌ నగర్‌
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన క్రీడా పాలసీ కారణంగా క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌ గా నిలిచిందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటూ వారు ప్రపంచ స్థాయి క్రీడల్లో రాణించేందుకు తోడ్పాటునందిస్తోందన్నారు. బుధవారం తమ క్యాంపు కార్యాలయంలో వారిని అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రపదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన 15 మంది కరాటే క్రీడాకారులు జూన్‌ 29 నుంచి జులై 1 వరకు అమెరికాలో జరిగే ప్రపంచ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌ కు ఎంపికైన తరుణంలో… థాయిలాండ్‌, మలేషియాలో వారం రోజుల పాటు జరిగే సన్నాహక శిబిరానికి 18 మంది కరాటే బృందం సభ్యులు ఇవాళ రాత్రి బ్యాంగ్‌ కాక్‌ తరలి విజయంతో తిరిగి రావాలని సూచించారు.వారం రోజుల పాటు జరిగే శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ లో పతకాలు సాధించి దేశం గర్వపడేలా చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ క్రీడా పాలసీ ద్వారా అనేక మంది మెరికల్లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశం గర్వపడేలా చేశారని అన్నారు. నిఖత్‌ జరీన్‌ అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్‌ గా నిలిచిన తరుణంలో డీఎస్పీ స్థాయి ఉద్యోగం, జూబ్లీహిల్స్‌ లో రూ. 20 కోట్ల విలువైన 600 గజాల విలువైన ఇంటి స్థలం అందించి అండగా నిలిచామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిఖత్‌, ఇషా సింగ్‌ వంటి అనేకమంది మెరికల్లాంటి క్రీడాకారులు అంతర్జాతీయంగా రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చారని… క్రీడల్లో రాణించే ఏ క్రీడాకారునికైనా ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కోచ్‌ రవి, కెప్టెన్‌ లక్ష్మీ, తెలంగాణకు చెందిన సహదేవ్‌, సాజిదా, రవి సహా 15 మంది క్రీడాకారులను మంత్రి ఘనంగా సత్కరించారు. ముడా చైర్మన్‌ గంజి వెంకన్న మున్సిపల్‌ చైర్మన్‌ కేసి నర్సింహులు, ముడా డైరెక్టర్‌ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.