దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో నిర్వహించిన ప్రెస్మీట్లో సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ,”విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలా మంది బాధ పడుతున్నారు. వీరికి సహాయం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షు, తెలంగాణకు రూ.25 లక్షలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు, అలాగే ఫెడరేషన్ తరపున చెరో 5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాం. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు సంబంధించి అకౌంట్ నెంబర్స్ అలాగే, ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తున్నాం. సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఈ అకౌంట్స్కు డబ్బులు పంపించవచ్చు’ అని తెలిపారు.
‘వరద బాధితులకు డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. మా కుటుంబం నుంచి కోటి రూపాయలు అందిస్తున్నాం’ అని నిర్మాత సురేష్ బాబు చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ,’మమ్మలి ఆదరించిన ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మా మద్దుతు ఎప్పుడూ ఉంటుంది’ అని అన్నారు.
‘మా నిర్మాణ సంస్థ నుంచి రెండు రాష్ట్రాలకు చెరో పాతిక లక్షలు ఇస్తున్నాం’ అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. అన్ని యూనియన్లతో సమావేశమై, ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం అని ఫిల్మ్ ఇండిస్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ,’వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండిస్టీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుంది’ అని చెప్పారు.