ప్రారంభమైన పది పరీక్షలు..

నవతెలంగాణ – చివ్వేంల
పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. చివ్వేంల మండల కేంద్రం తో పాటు, తిరుమలగిరి (జి )లో పరీక్ష కేంద్రం  ఏర్పాటు చేశారు.. ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు పదవ తరగతి పరీక్షలు కొనసాగనుండగా గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.ఆయా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. మొదటిసారి బోర్డు పరీక్షలు రాయనుండడంతో విద్యార్థుల్లో కొంత ఆందోళన కూడా కనిపించింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మిత్రులు పరీక్షా కేంద్రాల వద్దకు తరలివచ్చి విద్యార్థులకు మనోదైర్యాన్ని కల్పించి పరీక్ష కేంద్రాలకు పంపించారు.  పదవ తరగతి పరీక్షలకు గాను  చివ్వేంల జడ్పీహెచ్ఎస్  హైస్కూలు సెంటర్ లో 198 మంది విద్యార్థులు పరీక్ష రాశారు . అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  తిరుమల గిరి (జి ) లో 114 మంది విద్యార్థులకు  గాను 111పరీక్ష రాశారు.ముగ్గురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. మొత్తం 312మంది విద్యార్థులకు గాను 309మంది విద్యార్థులు పరీక్ష రాశారు . పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంఈఓ గోపాల్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉందని ఆయా కేంద్రాలకు సమీపంలో ఎవరూ రాకుండా ఉండాలని పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.