– 11 గంటలకు విడుదల చేయనున్న బుర్రా వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో గోదావరి హాల్లో ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు. గతనెల 18 నుంచి ఈనెల రెండో తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది అబ్బాయిలు, 2,50,433 మంది అమ్మాయిలున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ప్రక్రియ ఈనెల నాలుగో తేదీ నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలో 18 జిల్లాల్లో 19 మూల్యాంకన కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఫలితాల కోసం http://results. bse.telangana.gov.in లేదా http://results.bsetelangana.org వెబ్సైట్లను సంప్రదించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు తెలిపారు.