– 25 మంది మృతి
బీరుట్ : హిజ్బుల్లాను అంతమొందించే నెపంతో లెబనాన్పైనా విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ శనివారం రాత్రి బీరుట్ శివారు ప్రాంతంలో భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 25 మంది పైగా చనిపోయారు. ఇప్పటికే నస్రల్లా సహా పలువురు కీలక నేతలను చంపేసినట్లు ప్రకటించిన ఇజ్రాయిల్ తాజా దాడుల్లో మరికొందరు కీలక నేతలను చంపేసినట్లు వెల్లడించింది. కాగా బీరుట్లో ఇజ్రాయిల్ జరిపిన తాజా దాడుల్లో 25 మంది చనిపోయారని, మరో 127 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. బీరుట్ శివారు ప్రాంతాలపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గత శనివారం రాత్రి జరిపినవే అత్యంత దారుణమైనవని లెబనాన్లో విధులు నిర్వహిస్తున్న పలువురు పాత్రికేయులు పేర్కొన్నారు. బాణసంచాలా మొదలైన దాడులు అంతకంతకూ పెరుగుతూ ఆదివారం ఉదయం వరకూ భీకరంగా సాగాయని చెప్పారు.