ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తాండ్ర నామినేషన్..

– తాండ్ర వినోదం రావు అశ్వారావుపేట నియోజక వర్గం వాసి కావడం విశేషం..
నవతెలంగాణ – ఖమ్మం
లోక్ సభ ఎన్నికలు నేపధ్యంలో ప్రారంభం అయిన నామినేషన్ లు ప్రక్రియలో శుక్రవారం భాజపా అభ్యర్ధిగా ఖమ్మం పార్లమెంట్ స్థానానికి తాండ్ర వినోదం రావు నామినేషన్ దాఖలు చేసారు. తాండ్ర వినోదం రావు అశ్వారావుపేట అసెంబ్లీ నియోజక వర్గం,ములకలపల్లి మండలం,తిమ్మంపేట విసి కావడం గమనార్హం.గతంలో ఈ నియోజక వర్గం నుండి ఖమ్మం పార్లమెంట్ బరిలో ఎవరూ తల పడక పోవడం విశేషం.
ఆయన గురించి సంక్షిప్తంగా..
వినోద్ రావు తాండ్ర ప్రజాసేవకు,ఆధ్యాత్మిక,ధార్మిక కార్యక్రమాలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చారు.రాముడి సేవకు,హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడిన వంశం వారిది.వీరి స్వగ్రామం కొత్తగూడెం – భద్రాద్రి జిల్లా ముల్కలపల్లి మండలం తిమ్మంపేట.1930 లలో వినోద్ రావు తాత సుదర్శన్ రావు భద్రాచలం రాములవారి ఆలయానికి ట్రస్టీ గా ఉండేవారు.ఆ హోదాలో  ముత్యాల తలంబ్రాలు సమర్పించే వారు.వారు ఆ రోజుల్లోనే మున్షీ వరకు చదివారు. వినోద్ రావు తండ్రి కృష్ణారావు వకీల్ రావు గారి గా పాల్వంచ ప్రాంతంలోనే కాకుండా జిల్లాలో పేరు పొందారు. వీరి పెదనాన్న టీ వీ నరసింహా రావు జడ్జి గా పనిచేశారు.  వినోద్ రావు ఇంటర్ వరకూ పాల్వంచలో చదువుకున్నారు.డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. అమెరికా లో మంచి ఉద్యోగం చేసినా, స్థిరపడడానికి మంచి అవకాశం ఉన్నా మాతృ భూమి మీద ప్రేమతో, ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో తిరిగివచ్చారు.వినోద్ రావు గత దశాబ్దానికి పైగా సోషల్ వర్కర్ గా పలు  స్వచ్ఛంద సంస్థ లలో  ఉన్నత బాధ్యతలు సమర్థంగా నిర్వహించి పేదలకు సేవ చేశారు.
ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూనే  2015 నుంచి 2021 వరకూ ఏకలవ్య ఫౌండేషన్ తరఫున విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం వంటి రంగాల్లో సేవలందించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో వారి నాయకత్వంలోని ఫౌండేషన్ అద్భుతమైన సేవ చేసింది.ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా లో గిరిజనుల అభ్యున్నతి కోసం చేసిన కృషి పలువురి ప్రసంశలు అందుకుంది. ప్రత్యేక విద్యా కార్యక్రమం ద్వారా రెండు రాష్ట్రాల్లో 24 జిల్లాల్లో బడుగు, బలహీన, నిరుపేద కుటుంబాలకు సేవ చేస్తున్నారు. డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం చైర్మన్ గా 2017 నుంచి జనవరి 2024 ఆయన అందించిన అద్భుత సేవలు ప్రశంసలు అందుకున్నాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకు పోవడంతో స్ఫూర్తి పొంది, ఈ మహా క్రతువులో తన వంతు పాత్ర పోషించేందుకు, ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజా సేవ కొనసాగించేందుకు ఉత్సుకతతో ఉన్నారు.