– రవి కుమార్ ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలి-తమ్మినేని
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ధన్యజీవి బోజెడ్ల రవికుమార్ అని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని రామన్నపేట గ్రామంలో ఆదివారం బోజెడ్ల రవికుమార్ 25వ వర్ధంతి సభను కూచిపూడి మధు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోజెడ్ల రవికుమార్, వెంకట నారాయణ స్థూపాల వద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడుతూ నేటి సమాజంలో మనుషులు చనిపోతే ఎక్కువ కాలం గుర్తుంచుకోవడంలేదని రవికుమార్ చనిపోయి 25 ఏళ్ళైనా నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రవి కుమార్ అన్నారు. రామన్నపేట, దానవాయిగూడెం, దారేడు ప్రాంతాలలో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిన చరిత్ర రవికుమార్ కు ఉందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. రవికుమార్ ఆశయ సాధన కొరకు నేటి యువత కృషి చేయాలని కోరారు. రవికుమార్ ఆశయ సాధనకు రవి కుమారుడు అజరు చేస్తున్న సేవలను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలో ముదిరాజ్ కులస్తులు నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి 50 వేల రూపాయలు చెక్కును అజరు, తమ్మినేని చేతుల మీదుగా ముదిరాజ్ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, తెల్దారుపల్లి సర్పంచ్ సిద్దినేని కోటయ్య, సిపిఎం నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా నాయకులు బోజెడ్ల సూర్యం, 60 వ డివిజన్ కార్పొరేటర్ నిరంజన్, మాజీ కార్పొరేటర్ పీట్ల కృష్ణమూర్తి, కాంగ్రెస్ నాయకులు నూకారపు వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు పెంటు సాహెబ్, సొసైటీ డైరెక్టర్ తాటికొండ శ్రీనివాసరావు, ముదిరాజ్ సంఘం నాయకుడు రామనబోయిన సంగయ్య, సీపీఎం నాయకులు పగిడిపల్లి వీరయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.