నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన హరిత హారం కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ హారంలా ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ హరిత హారం కోసం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుంటే దారి పొడవునా ప్రజల సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వ నిధులతో అడ్డగోలుగా అధికార దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్, బీఆర్ఎస్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.