ఫ్లెక్సీలకు విద్యుత్‌ వైర్లు తాకాయని..

– తొలగిస్తుండగా ఇద్దరు యువకుల మృతి
నవతెలంగాణ-కొల్చారం
మెదక్‌, హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వేసిన ఫ్లెక్సీలకు విద్యుత్‌ వైర్లు తాకడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున మెదక్‌ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్‌లో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అక్కిం యాదగిరి కుమారుడు నవీన్‌ (21), పసుపుల చిన్న వెంకటేశం కుమారుడు పసుపుల ప్రసాద్‌ (20) గురువారం తెల్లవారుజామున తమ వ్యవసాయ పొలంలో నారుమడిలో నీరు పెట్టి, అడవి పందులు రాకుండా మంటలు పెట్టడానికి వెళ్లారు. తమ పొలం సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విద్యుత్‌ హై టెన్షన్‌ వైర్‌కు ఆనుకొని ఉండడంతో ఫ్లెక్సీల కాంట్రాక్టర్‌ వాటిని తొలగించలేదు. వాటిని తీయడానికి ప్రసాద్‌, నవీన్‌ ప్రయత్నించగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్‌ఐ మొహమ్మద్‌ గౌస్‌ కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.