రూపేష్ కథానాయకుడిగా మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా ‘షష్టిపూర్తి’. డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన ఇందులో ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ సినిమాలోని ‘ఏదో ఏ జన్మలోదో’ సాంగ్ త్వరలో విడుదల చేయనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏమిటంటే, ఇళయరాజా సంగీతం అందించగా, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సాహిత్యం సమకూర్చారు. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ, ‘మా సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. చైతన్య ప్రసాద్ కొన్ని పాటలకు సాహిత్యం అందించారు. ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే ఓ పాటకు కీరవాణి అయితే బావుంటుందని అనిపించింది. చైతన్య ప్రసాద్ ద్వారా ఆయన్ని అప్రోచ్ అయ్యాం. సందర్భం చెప్పి సాంగ్ రాయమని రిక్వెస్ట్ చేయగా, ఆయన ఓకే అన్నారు. ఇళయరాజా బాణీకి కీరవాణి సాహిత్యం అందించడం, అది మా సినిమాలో పాట కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కీరవాణి ఇప్పటివరకూ 60 పైగా పాటలు రాశారు కానీ, ఇళయరాజా బాణీకి రాయడం ఇదే ప్రథమం. అది కూడా కీరవాణి ఆస్కార్ గెలుచుకున్న తర్వాత రాయడం ఇంకా విశేషం’ అని అన్నారు. ‘ఇళయరాజా సంగీతం, కీరవాణి సాహిత్యంతో కూడిన పాట మా సినిమాలో ఉండటం కంటే ఇంకేం కావాలి? ఈ అవకాశం హీరోగా, నిర్మాతగా నాకు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. కుటుంబ బంధాలు, విలువల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం’ అని హీరో, నిర్మాత రూపేష్ చెప్పారు.