రైతులకు దన్నుగా నిలవడమే ధ్యేయం

CM Revanth Reddy– సీఎం రేవంత్‌ రెడ్డి
– పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్‌ చౌహాన్‌తో భేటీ
– ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనలోకి తిరిగి తెలంగాణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. సాగు రంగంలోని ప్రతికూలతలను తట్టుకుంటూ రైతులకు రక్షణగా నిలిచేందుకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)లో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్‌ చౌహాన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఎంఎఫ్‌బీవైలో 2016 నుంచి 2020 వరకు తెలంగాణ ఉన్న విషయం, ఆ తర్వాత నాటి ప్రభుత్వం దాని నుంచి ఉపసంహరించుకున్న తీరుపై వారు చర్చించారు. పీఎంఎఫ్‌బీవైలోకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగిచేరడంతో వచ్చే పంట కాలం నుంచి రైతులు పంటల బీమాను పొందనున్నారు. పీఎంఎఫ్‌బీవైతో రైతులకు ప్రయోజనం కలుగుతుందనీ, పంటలు నష్టపోయినప్పుడు సకాలంలోనే పరిహారం అందుతుందని రితేష్‌ చౌహాన్‌ ఈ సందర్భంగా తెలిపారు. సీఎం రేవంత్‌ స్పందిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమలుకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గోపి తదితరులు పాల్గొన్నారు.