– 500 మందికి ఒక సర్వేయర్
– 31 నాటికి పరిశీలన పూర్తి చేయాలి
– 13లోపు సామాజిక సర్వే తుది గడువు
– 14న సంక్షేమ హాస్టల్ విద్యార్ధులతో సహపంక్తి భోజనం
– 15,16 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు : కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, గ్రూప్-2 పరీక్షల నిర్వహణ, మెస్ చార్జీలపెంపు, సామాజిక సర్వే తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈనెల 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఈ సర్వే వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేయాలన్నారు. ప్రతి ఐదు వందల మందికి ఒక ఉద్యోగి ( సర్వేయర్)ని నియమించుకోవాలని సూచించారు. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు వేయించాలని సూచించారు. అంతేగాక స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్టకుండా చిన్న చిన్న పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పకడ్బందీగా సర్వే నిర్వహించా లన్నారు. సర్వే వివరాలపై ప్రతి రోజు కలెక్టర్లు సమీక్షించుకోవాలని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఓ నిరంతర ప్రక్రియ అని ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లను నిర్మించబోతున్నట్టు తెలిపారు.
గత ప్రభుత్వం పదేండ్లలో ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్ధుల మెస్ చార్జీలను ఒక్కసారి కూడా పెంచలేదన్నారు. తమ ప్రభుత్వం ఏడాది లోపే 40శాతం మెస్ చార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఈ నిర్ణయం వల్ల 7.65 లక్షల మంది విద్యార్దులకు ప్రయోజనం కలిగిందనీ, కలెక్టర్లు తరచూ హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్ధులకు అందించే సరుకుల క్వాలిటీ, క్వాంటిటీపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఈనెల 14న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు స్థానికంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లను సందర్శించి అక్కడే విద్యార్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా పాల్గొనాలని సూచించారు.
సామాజిక సర్వే
రాష్ట్రంలో కోటి 16 లక్షల కుటుంబాలకుగానూ కోటి 12 లక్షల కుటుంబాల సామాజిక సర్వే (99.09 శాతం) పూర్తి చేసినట్టు తెలిపారు. ఇందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ఈనెల 13న సామాజిక సర్వేకు తుదిగడువన్నారు. ఆ తర్వాత ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా కుటుంబ సర్వే వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.