– కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
కల్లుగీత కార్మికుల సమస్యల ను పరిష్కారం చేస్తామని మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మేకపోతుల వెంకటరమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈనెల 22వ తేదీన హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ వద్ద జరిగే మహాధర్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సోమవారం అంబేద్కర్ భవనంలో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది చనిపోవడం, కాళ్ళు చేతులు విరగడం, నడుము పడిపోవడం జరుగుతుంది.రాష్ట్రంలో రెండు రోజులకు ఒకరు చనిపోతున్నారు. ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని, సేఫ్టి మోకులు ఇవ్వాలని,సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, 2023- 24 బడ్జెట్ లో గీత కార్మికులకు కేటాయించిన డబ్బులు వెంటనే విడుదల చేయాలనిడిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో ఇచ్చిన 18 డిమాండ్ల హామీని అమలు చేయాలనిపేర్కొన్నారు. 22 న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది గీత కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేజీ కేఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండా వెంకన్న, చౌకాని సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేజీ కేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యూ.వెంకట నరసయ్య, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్,రాష్ట్ర కమిటీ సభ్యులు ఉప్పల గోపాల్,జిల్లా ఉపాధ్యక్షులు కొప్పు అంజయ్య,జిల్లా సహాయ కార్యదర్శులు రాచకొండ వెంకట్ గౌడ్,జేర్రిపోతుల ధనుంజయ గౌడ్, మతాల లింగస్వామి, నర్సింగ్ సైదులు, బోల్లేపల్లీ రమేష్, కర్ణాటక లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.