ఉద్యోగులకు ఇచ్చిన హామీలు గాలికే…

– బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మెన్‌ దేవీ ప్రసాద్‌ తదితరులతో కలిసి పాతూరి మీడియాతో మాట్లాడారు. ఈనెల 17 నాటికి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చ లేకపోయిందని అన్నారు. ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రతీ నెలా ఒకటో తారీఖును వేతనాలేస్తున్నామని చెబుతున్నా… అవి అందరికీ రావటం లేదని తెలిపారు. వీటన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.