– 7 వికెట్లతో తొలి టెస్టులో విజయం
మకాయ్ : భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ తొలి అనధికార టెస్టులో ఆతిథ్య జట్టు అలవోక విజయం సాధించింది. 225 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్-ఏ 75 ఓవర్లలో మరో ఏడు వికెట్లు ఉండగానే ఛేదించింది. కెప్టెన్ నాథన్ మెక్స్వీనీ (88 నాటౌట్, 178 బంతుల్లో 9 ఫోర్లు), వెబ్స్టర్ (61 నాటౌట్, 117 బంతుల్లో 4 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీలతో కదం తొక్కారు. 139/3 ఓవర్నైట్ స్కోరుతో ఛేదన మొదలెట్టిన ఆసీస్-ఏ.. నాల్గో రోజు ఆటలో ఒక్క వికెట్ కోల్పోలేదు. భారత-ఏ బౌలర్లలో ముకేశ్, ప్రసిద్, మానవ్లు తలా ఓ వికెట్ పడగొట్టారు. నితీశ్ కుమార్ రెడ్డి 9 ఓవర్లలో ఒక్క వికెట్ పడగొట్టలేదు. రెండు మ్యాచుల సిరీస్లో ఆసీస్-ఏ 1-0తో ఆధిక్యం సాధించింది. ఉదయం సెషన్లో ఆట ఆరంభమయ్యాక బంతి మార్చారనే కారణంతో అంపైర్తో వాగ్వాదానికి దిగిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్పై ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేసింది. ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో బంతి మార్చినా.. ఆ సంగతి తెలియని కిషన్ ఫీల్డ్ అంపైర్లతో గొడవ పడ్డాడు.