నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల జాబితాలో ఉండి కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చని 40 కులాలను వెంటనే కేంద్ర జాబితాలో కలిపేలా చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని బీసీ కమిషన్ తీర్మానించింది. ఇటీవల పాత ఉమ్మడి జిల్లా కేంద్రాలలో జరిపిన బహిరంగ విచారణల్లో వచ్చిన వినతులను శుక్రవారం హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయంలో సమీక్షిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బీసీ జాబితాలో 130 కులాలు ఉండగా, కేంద్ర ఓబీసీ జాబితాలో రాష్ట్రానికి చెందిన 90 కులాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఆ జాబితాలో చేర్చబడని 40 కులాలను కేంద్ర జాబితాలో కలిపేందుకు రాష్ట్రం ప్రభుత్వం ఇదివరకే ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొన్నది.
తొలి విడతలో అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు, రెండో విడతలో నవంబరు 18 నుంచి 26 వరకు కమిషన్ బహిరంగ విచారణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు, దొమ్మర, పిచ్చకుంట్ల, బుడబుక్కల, తమ్మలి తదితర కులాల పేర్లలో మార్పులను కోరుతూ వచ్చిన వినతులపట్ల సానుకూలంగా స్పందించిన కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రభుత్వానికి తమ సిఫారసులు అందించాలని నిర్ణయించింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయాలు కోరుతూ కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసి నెల రోజుల పాటు అభిప్రాయాలను స్వీకరించనుంది. ఇంకా వివిధ అంశాలపై తగు పరిశీలనలు చేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయిం చింది. అంతకుముందు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్ చైర్మెన్, సభ్యులతో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. కమిషన్ సమావేశం అనంతరం అక్బరుద్దీన్ నేతృత్వంలో ఎం.ఐ.ఎం ప్రజాప్రతినిధుల బృందం కమిషన్తో భేటీ అయి ముస్లింలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై విజ్ఞాపన పత్రం సమర్పించారు.