![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230912-WA0026.jpg)
-బెజ్జంకి క్రాసింగ్ గ్రామ శివారులో గుంతల రోడ్డు పరిశీలన
-రాబోయే ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతులవ్వాలని విజ్ఞప్తి
నవతెలంగాణ- బెజ్జంకి :
మండల కేంద్రానికి రాకపోకలు సాగించే ప్రధాన రోడ్డు బెజ్జంకి క్రాసింగ్ గ్రామ శివారులో గుంతలమయమై అధ్వానంగా మారిందని.. స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులకు అందలమెక్కిస్తూ.. ప్రజలకు శఠగోపం పెడుతున్నారని బీఎస్పీ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దొల్ల శ్రీనివాస్ అగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామ శివారులో గుంతలమైయమైన బెజ్జంకి ప్రధాన రోడ్డును బీఎస్పీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా బెజ్జంకి ప్రధాన రోడ్డు గుంతలుగా మారి ప్రమాదకరంగా మారిందని.. నిత్యం మా నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్న చూసిచూడనట్టు వ్యవహరించడంలో అంతర్యమేమిటో తెలియదని అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు మండల పర్యటన వస్తేనే ప్రజాప్రతినిధులు రోడ్లపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేసి మెప్పుపొందుతున్నారని.. తమ నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యతలో.. ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు కాస్తయైన ఇవ్వకుండా విస్మరిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కాలం వెళ్లదీస్తున్నారని ఇప్పటికైన రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకునే తీరులో చైతన్యవంతులవ్వాలని విజ్ఞప్తి చేశారు.