రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం..

– మాట్లాడిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టిన ఘన చరిత్ర మీది

– మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
నవతెలంగాణ- షాద్ నగర్
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని, అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మకూడదని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ జడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు బిఆరెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని గమనించాలని, పదేండ్లు ప్రజలు పడిన ఇబ్బందులు చాలని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం చేపడితే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో సహకరించిందని, తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజలు కేసీఆర్ పార్టీని నమ్మి అధికారం కట్టబెడితే వారు ఇచ్చిన మేనిఫెస్టోలలో ఎన్ని హామీలు నెరవేర్చారు? ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. మళ్లీ నియోజకవర్గంలో ప్రజలను మోసం చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుందని ప్రజలు వీరి మోసాలను గమనించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పథకాలను కాపీ పేస్టు చేసి మరోసారి ప్రజలను వంచించేందుకు వస్తున్నారని వారిని నిలదీయాలని తెలిపారు. దళిత బంధు బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఇచ్చారని, దళితుల్లో పేదవారు బాగుపడినట్లు లేదని అన్నారు. బిఆరెస్ ప్రభుత్వ హయాంలో గల్లిగల్లీకి బెల్టు షాపులు ఓపెన్ చేసిన ప్రజలను తాగుడుకు బానిసలుగా మార్చారని వాపోయారు. బిఆరెస్, బిజెపి రెండు ఒక్కటేనని ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మీ ఆట కట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.సమస్యలపై మాట్లాడిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి జైలుకు పంపిన మీలాంటి వారు మళ్ళీ గెలువకూడదని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. ప్రజల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడిందని, ఇప్పుడు కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు.ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వీర్లపల్లి శంకర్ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, రాజు, కృష్ణా రెడ్డి,చెన్నయ్య, తిరుపతి రెడ్డి,పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి,బాదేపల్లి సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.