– ఫిన్ క్వెస్ట్, ఐటీసీ ప్రతినిధులతో సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ములుగు జిల్లా కమలాపురంలోని బల్లాపూర్ ఇండిస్టీస్ లిమిటెడ్ (బిల్ట్) కంపెనీ పునరుద్ధరణ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీనియర్ అధికారులతో ఇదే అంశపై సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో ఆయనప సమీక్ష నిర్వహించారు. మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జును తయారు చేస్తారు. 2014లోనే ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించటంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపారు. నేషనల్ కంపెనీ లా ట్రిబున్యల్ తీర్పు ప్రకారం ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధీనంలో ఉన్నాయి. ఆ కంపెనీ ఎండీ హార్దిక్ పటేల్, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈవో వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ఆలోచనను వారితో పంచుకున్నారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు. మిల్లును తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్క్వెస్ట్ బృందాన్ని కోరారు. బిల్ట్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెనీ ఆసక్తి చూపుతోంది. ఫిన్ క్వెస్ట్ కంపెనీ ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఈ సందర్భంగా కోరారు.
మిల్లును పునరుద్ధరించే ప్రక్రియలో ఐటీసీకి అన్ని విధాలా ప్రభుత్వం తరుపున సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చించారు. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.