
– ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
– 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేత
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
విద్యార్థులు చిన్నప్పటినుండి కష్టపడి చదివి మంచి ప్రతిభ సాధించి భవిష్యత్తులో సమాజంలో ఉన్నత స్థానం పొందాలి. ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పిలుపునిచ్చారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన వసతి గృహాలలో ఉంటూ కష్టపడి చదివి పదవ తరగతి ఫలితాలలో 10 జిపిఏ సాధించిన విద్యార్థులను నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సోమవారం అభినందించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యార్థులకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్లలో ఉంటూ కష్టపడి చదివి పదికి పది జీపీఎ సాధించడం సంతోషకరమని, వీరిని ఆదర్శంగా తీసుకుని ఇతర విద్యార్థులు సైతం బాగా చదివి మంచి మార్కులు పొందాలని కోరారు. కష్టపడి చదివిన వారికి భవిష్యత్తు బాగుంటుందని, చదువుతోనే మన జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని, ప్రతి ఒక్కరూ ఇలాగే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ సూచించారు.10 జిపిఎ సాధించిన వారిలో గిరిజన సంక్షేమ హాస్టల్ లో చదివిన రమావత్ సర్దార్, పాల్త్య సహారా(బాలిక), వడ్త్యా అరవింద్, ఎస్సి సంక్షేమ హాస్టల్లో చదివిన ఇరాపురి అక్షర, చలమల పుష్కరిణి, అయేషా అంజుమ్ లు ఉన్నారు. కరోనా సమయంలో అకాల మరణం చెందిన మునుగోడు తహసిల్దార్ సునంద పేరు మీద తన భర్త లక్ష్మారెడ్డి 10 జీపీఏ సాధించిన ముగ్గురు ఎస్సీ సంక్షేమ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి,హౌసింగ్ పిడి రాజ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.