నవతెలంగాణ -తాడ్వాయి
ఓటరు నమోదు, మార్పులు , చేర్పులకు ఈ నెల 27,28 సెప్టెంబర్ 2,3 తేదీలలో ప్రతి బూతు స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని యువత, ఓటర్లు వినియోగించుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సెకండ్ సమ్మరి రివిజన్ పై బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21 న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ప్రచురించబడుతుందని, అట్టి ప్రతిని అందరికి అందజేస్తామన్నారు. అక్టోబర్ 4 న తుది ఓటర్ల జాబితా వెలువడుతుందని, ఆ జాబితా ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఓటరు జాబితాలో పేరులో మార్పులు,చేర్పులకు ఇదే చివరి అవకాశమని, అర్హులైన ప్రతి యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. జనాభాలో 5 శాతం 18-19 ఏళ్ళు నిండి వారుంటారని, జిల్లాలో రెండున్నర శాతం మాత్రమే ఓటరుగా నమోదయ్యారని, 18 ఏళ్ళు నిండిన యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. కళాశాల స్థాయిలో ఓటరు నమోదుకు జిల్లా యంత్రాంగం స్వీప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నదన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైనదని, ఓటరుగా నమోదయిన ప్రతి వ్యకి తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కలిగించాలన్నారు. ప్రతి బూతు స్థాయిలో తమ ప్రతినిధులను ఏజెంట్లు నియమించుకోవాలని,డ్రాఫ్ట్ ఓటరు జాబితాను పరిశీలించి మార్పులు,చేర్పులు ఉంటే చేసుకోవాలని సూచించారు. చనిపోయిన వారి పేర్లు ఉంటే తొలగించాలని, ఒకే కుటుంబంలోని ఓటర్లు వివిధ పోలింగ్ బూతులతో ఉంటే సరిచేసుకోవాలని,
అర్హులను ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే 1950 టోల్ ఫ్రీ నెంబరుకు డయల్ చేయాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లకు కూడా ఈ వి ఏం ల ఓటింగ్ చేయుటపై కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాలతో పాటు మొబైల్ వ్యాన్ ల ద్వారా మాక్ పోల్ నిర్వహిస్తూ అవగాహన కనిపిస్తున్నామన్నారు. వివిధ కారణాల వల్ల నియోజక వర్గాలలోని కొన్ని పోలింగ్ కేంద్రాల ప్రాంతాలను మార్చామని, ప్రస్తుతమున్న 790పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు సరిపడా ఈ వి ఏం లు, వివి ప్యాడ్ లు అందుబాటులో స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయని, ప్రతి నెల వాటిని పరిశీలిస్తున్నామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించవచ్చని చెప్పారు. ఎన్నికల ప్రకటన వెలువడిన వేంటనే కోడ్ అమలులోకి వస్తుందని, ఆ మేరకు రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, కుల, మత విద్వేషాలకు తావివ్వరాదని, వ్యక్తిగత దూషణ చేయరాదని, ఓటర్లను నగదు, మద్యంతో ప్రలోభపెట్టరాదని, అభ్యర్థి గరిష్టంగా రూ. 40 లక్షలకు ఖర్చు మించకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఖాసీం అలీ, నరేందర్, నరేష్ గౌడ్, జఫ్ఫార్ ఖాన్, తాహెర్, హరిలాల్, వెంకట్ గౌడ్, బాల్ రాజు పాల్గొన్నారు.