నవతెలంగాణ-నస్పూర్
సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.33 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కె బాజీసైదా అన్నారు. మంగళవారం ఆర్కె న్యూటెక్ గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన జెన్కో,ట్రాన్స్కో లకు బొగ్గు విద్యుత్ను సరఫరా చేసిందని గత ప్రభుత్వ హయాంలో బొగ్గు అమ్మినవి రూ.12,000 కోట్లు, విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.17వేల కోట్ల సింగరేణికి చెల్లించకుండా రూ.29 వేల కోట్ల బకాయి ఉందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. నాలుగువేల కోట్ల వరకు బకాయిలు పడిందని, మొత్తం రూ.33 వేల కోట్ల రూపాయల బకాయిలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు చెల్లించకపోతే సింగరేణి సంస్థ అప్పుల్లో కూరుకు పోతుందని దానివల్ల కార్మికులకు వేతనాల చెల్లింపు, సంస్థ విస్తరణ కోసం అభివృద్ధి కోసం మిషనరీ కొనుగోలు కోసం ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వమే అని చెప్పుకు తిరిగే ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణి సంస్థ మనుగడకు, విస్తరణకు సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించే విధంగా ప్రయత్నాలు చేయాలని వారు సూచించారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు అవినీతికి తావు లేకుండా కార్మికులకు రావాల్సిన ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ పారదర్శకంగా చేస్తున్నామన్నారు. కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీని విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని కార్మికుల్లో ఏఐటీయూసీకి ఉన్న ఆదరణ అభిమానాలు చూడలేక కొన్ని కార్మిక సంఘాలు వారి మనుగడ కోసం విమర్శిస్తున్నాయన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీల అమలు కొరకు పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి సంపత్, ఫిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు గజ్జి రమేష్, చంద్రశేఖర్, సిద్ధం అజరు పాల్గొన్నారు.