నెలాఖరులోగా ఉస్మానియాకు శంకుస్థాపన

– భవిష్యత్‌ అవసరాలకనుగుణంగా డిజైన్లు
– ఆ దిశగా చర్యలు చేపట్టండి
– అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జనవరి నెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసంలో ఆస్పత్రి నిర్మాణంపె సీఎం సమీక్ష నిర్వహించారు. గోషామహల్‌లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌శాఖ పరిధిలో ఉన్న స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆస్పత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాపులను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. వాటిల్లో కొన్ని మార్పులు, చేర్పులను సీఎం సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఆస్పత్రి నిర్మాణం ఉండాలనీ, నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని ఆదేశించారు. రోడ్లు, పార్కింగ్‌, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సూచించారు. రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్‌ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలని ఆధికారులకు దిశానిర్దేశం చేశారు. అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్‌ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా అత్యాధునిక వసతులతో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం ఉండాలని సీఎం ఆకాంక్షించారు.