‘గుట్ట’ గోపురానికి బంగారు తాపడం 2025 మార్చిలోపు పూర్తిచేయాలి

– అధికారులకు మంత్రి సురేఖ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విమాన గోపురానికి బంగారు తాపడం పనుల్ని ప్రారంభించాలని దేవాదయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ అధికారుల్ని ఆదేశించారు. ఈ పనుల్ని స్మార్ట్‌ క్రియేషన్స్‌ అనే కంపెనీకి ప్రభుత్వం అప్పగించిందనీ, బ్రహ్మౌత్సవాలు ప్రారంభానికంటే ముందు 2025 మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతల్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామ య్యర్‌ చైర్‌పర్సన్‌గా, డైరక్టర్‌ కన్వీనర్‌గా, ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ సలహాదారు, వైటీడీఏ వైస్‌ చైర్మెన్‌ జీ కిషన్‌రావు, యాదగిరి గుట్ట దేవస్థాన కార్యనిర్వహణాధికారి, విద్యుత్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ను సభ్యులుగా ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రెండు వేర్వేరు జీవోలను జారీ చేసినట్టు మంత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయ అభివృద్ధి, విస్తరణ పనుల నిమిత్తం భూసేకరణకు అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మరో జీవోను కూడా జారీ చేసిందని చెప్పారు.