– తక్షణమే కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను పర్మినెంట్ చేయాలి
– లేనిపక్షంలో సమ్మె ఉధృతం చేస్తాం
– ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి : సిఐటియు నగర అధ్యక్షులు కుమారస్వామి
-14వ రోజు హైదరాబాద్ కలెక్టర్ వద్ద ధర్నా
నవతెలంగాణ- సిటీ బ్యూరో : కాంట్రాక్ట్ ANMల రెగ్యులర్ విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, వెంటనే రాష్ట్రంలోని ఏఎన్ఎం లను పర్మినెంట్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU ) నగర అధ్యక్షులు జే . కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 14వ రోజు సమ్మె సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ఏఎన్ఎంలు పాల్గొని ధర్నా చేపట్టారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు యూనియన్లతో చర్చలు జరిపినప్పటికీ ప్రభుత్వo మొండి వైఖరిని వీడడం లేదనీ మండిపడ్డారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎం అందర్నీ డైరెక్ట్ గా రెగ్యులర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయనీ, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకుండా మొండిగా రాత పరీక్ష ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తామని అంటున్నదన్నారు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో 1520 పోస్టులు ప్రకటించి యూనియన్లతో చర్చల అనంతరం మరో 400 పైచిలుకు పోస్టులు పెంచిందనీ గుర్తు చేశారు. గతంలో లేని పోస్టులు చర్చల అనంతరం ఎలా పెరిగాయన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జనాభా ప్రాతిపదికన, సబ్ సెంటర్ ప్రాతిపదికన గనుక లెక్కలు తీస్తే ఏఎన్ఎం పోస్టులు పెరగడానికి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ఏఎన్ఎం లందరినీ రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా రాత పరీక్ష ద్వారానే పోస్టుల్ని నింపుతామని కూర్చోవడం మూలంగా రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో గత 20 ఏండ్లుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలు నష్టపోతారనన్నారు. రాత పరీక్ష అంటే కొత్తగా వచ్చిన విద్యార్థులతో వీరు పోటీ పడడమే, దీనివల్ల వీరికి నష్టం జరుగుతుందన్నారు. ఇదే వైద్య ఆరోగ్యశాఖలో గతంలో పారామెడికల్ సిబ్బందిని, మెడికల్ ఆఫీసర్లను ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేసినప్పటికీ ఏఎన్ఎంల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరి ఎందుకు అవలంబిస్తున్నదన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉండకుండా కాంట్రాక్ట్ ఏఎన్ఎం అందరిని రెగ్యులర్ చేయాలని, లేని పక్షంలో సమ్మె ఉధృతంగా ముందుకు వెళుతుందని, ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ధర్నా అనంతరం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ప్రతినిధులు అదనపు కలెక్టర్ మధుసూదన్ ని కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ర్ట కోశాధికారి A. కవిత , నగర ప్రధాన కార్యదర్శి కిరణ్మయి, నగర నాయకులు రాజేశ్వరి, లక్ష్మి, అమ్మాజీ, విజయ, ప్రణయశీల తదితరులు పాల్గొన్నారు.