తెలంగాణ ఉద్యమ చరిత్ర భవిష్యత్‌ తరాలకు అందాలి

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ చిన్నారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఉద్యమ తొలి, మలి దశ చరిత్ర భవిష్యత్‌ తరాలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ జి చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, స్వరాష్ట్ర సాధన ఉద్యమ ఘట్టాల నేపథ్యాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకు వివరించేందుకు సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్‌ కృషి చేయాలని కోరారు. మంగళవారం డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్‌ విభాగం అధిపతిగా కెప్టెన్‌ పాండురంగారెడ్డి బాధ్యతలు తీసుకున్న కార్యక్రమానికి చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గొప్పతనం, చారిత్రక విశిష్టతను రాబోయే తరం తెలుసుకునే విధంగా రచనలు అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ చరిత్రకారులు, కవులు, రచయితలు, సంస్థలు, ఉద్యమకారులు కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమ తొలి, మలిదశ ఘట్టాలు, మలిదశ ఉద్యమాన్ని రగిలించిన తన నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల సేకరణ, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత గురించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి వివరించిన ఘట్టాలను, చరిత్రను కూడా రాబోయే తరానికి అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ సందర్భంగా ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌ శశాంక్‌ గోయల్‌తో చిన్నారెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ చరిత్రకు సంబంధించిన రచనలను ఈ సంస్థ ద్వారా ప్రచురించాలని చిన్నారెడ్డి కోరగా, అందుకు శశాంక్‌ గోయల్‌ సమ్మతించారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ అధికారి మాధవి రావులపాటి తదితరులు పాల్గొన్నారు.