రాష్ట్రానికి పెట్టుబడులు రూ.40,232 కోట్లు

to the state Investments 40232 crores– 200 సంస్థలతో సీఎం రేవంత్‌ సంప్రదింపులు
– విజయవంతంగా ముగిసిన దావోస్‌ పర్యటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు ఎక్కువ. అదానీ గ్రూప్‌, జేఎస్‌ డబ్ల్యూ, వెబ్‌వర్క్స్‌, టాటా టెక్నాలజీస్‌, బీఎల్‌ ఆగ్రో, సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ గ్రూప్‌ హౌల్డింగ్స్‌, గోడి ఎనర్జీ, అరజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్‌, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్‌, ఓ9 సొల్యూషన్స్‌ తదితర కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివిధ ఫోరమ్‌లలో మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. మరో సదస్సులో మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఆసియా మెడికల్‌ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్‌ కేర్‌ను సాఫ్ట్‌వేర్‌తో సమ్మిళితం చేయాలన్నారు. ఖరీదైన హెల్త్‌ కేర్‌ సేవల ఖర్చులను తగ్గించేందుకు అమెరికా, యూరప్‌ దేశాలు పని చేస్తున్నాయని తెలిపారు. హెల్త్‌ కేర్‌ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు, అధునాతన వైద్య సేవలను మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరుకోడానికి డిజిటల్‌, సాంకేతికను ఉపయోగించాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రితో సమావేశమైన భారతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్‌ బిజినెస్‌ లీడర్లందరూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపారం, స్నేహ దృక్పథానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. దావోస్‌కు రావడం.. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవటం సంతోషంగా ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్‌కు రావాలి…’ అని సీఎం స్వాగతం పలికారు.