కులగణన అంశం కీలకమే

కులగణన అంశం
కీలకమే– మెరుగైన విద్య,ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వంలో వెనుకబాటు : అమర్త్య సేన్‌
కోల్‌కతా : కులగణన పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే అని అమర్త్య సేన్‌ అన్నారు. అయితే అంతకంటే ముందు మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం వంటి అంశాల్లో వెనుకబడిన వారికి మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశ పౌరుడినైనందుకు చాలా గర్విస్తున్నానని తెలిపారు. కానీ, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంకా చాలా కృషి జరగాలన్నారు.
భారత్‌లో విపక్షాలు బలహీనపడడానికి కారణాలు, ఎన్డీయే సర్కార్‌ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్త్య సేన్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు.బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అమర్త్య సేన్‌ విమర్శలు గుప్పించారు. భారత్‌ అభివద్ధికి నిరక్షరాస్యత, లింగ అసమానత్వం అడ్డంకులుగా మారాయని తెలిపారు. భారత పాలకవర్గం పూర్తిగా ధనవంతుల పక్షానే నిలుస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంలో మార్పులపై ప్రస్తావించగా.. దాని వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు.ఐకమత్యం లేకపోవడం వల్లే భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉంటే బీజేపీని ఓడించడానికి కావాల్సిన బలం లభించి ఉండేదన్నారు. వ్యవస్థాగత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌.. తన ఘనమైన గతం నుంచి స్ఫూర్తి పొందాలని హితవు పలికారు.