ప్రజాబాహుళ్యం బాగుకోసమే “న్యాయసేవల చట్టం”..

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల…
– జాతీయ లోక్ అదాలత్ విజయవంతం.
– 52 మోటారు రోడ్డు ప్రమాద నష్టపరిహార దావాలలో 4 కోట్ల 67 లక్షల 46 వేలకు గాను అవార్డులు జారీ.
– ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల కేసులలో 20లక్షల మొండి బకాయిలు రాజీపద్దతిన వసూలు
– మొత్తం 7300 కేసుల పరిష్కారం.
నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రజల మధ్య దీర్ఘకాలిక శత్రుత్వాలు,కక్షలు ఉండరాదనే మంచి సంకల్పంతో న్యాయసేవల చట్టం రూపొందించారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల తెలిపారు.ప్రజలందరి బాగుకోసమే న్యాయసేవల చట్టం అమలు చేసుకుంటున్నామని అన్నారు. జిల్లాకోర్టు ఆవరణలోని న్యాయసేవ సదన్ లో శనివారం జాతీయ లోక్ అదాలత్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రధానోపన్యాసం చేశారు. ఒక వివాదం వ్యక్తుల మధ్య వివాదానికి కారణమై అది సివిల్, క్రిమినల్ చర్యలకు దారి తీస్తుందని పేర్కొన్నారు. ఏ వివాదం అయిన పౌరులను తాత్కాలికంగా వేరు చేసిన శాశ్వతంగా దూరం చేయరాదనే చట్టం ముఖ్యఉద్దేశమని ఆమె వెల్లడించారు.ప్రగతికాముక వ్యవస్థ నిర్మాణానికి వ్యక్తుల వ్యక్తిగత కక్షలు కారణం కారాదని అన్నారు. ప్రజలందరు ఉమ్మడిగా చట్టాల ప్రయోజనాలు స్వీకరించాలని మహాసంకల్పానికి సహకరించాలని అభ్యర్థించారు. లోక్ అదాలత్ లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు,అన్ని రకాల సివిల్ దావాలు పరిష్కారించుకుంటే ఎగువ న్యాయస్థానాలలో అప్పీలుకు అవకాశం లేదని తెలిపారు. ప్రతి లోక్ అదాలత్ జిల్లా ప్రజల నుండి ఆదరణ లభిస్తోందని మునుముందు మరింత ప్రోత్సాహాన్ని అందివ్వాలని జిల్లాజడ్జి సునీత కోరారు. అదనపు జిల్లాజడ్జి కనక దుర్గ మాట్లాడుతూ పూర్వ కాలంలో ప్రజల మధ్య ఏర్పడిన వివాదాలను పంచాయతీ పద్ధతిన పరిష్కరించే విధానమే నేటి లోక్ అదాలత్ విధానమని తెలిపారు.భారత రాజ్యాంగాన్ని చదవాలని హక్కులు, బాధ్యతలు తెలుస్తాయని అన్నారు.సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలలోని బాధితులకు బాసటగా న్యాయసేవ సంస్థ నిలుస్తున్నదని ఆమె తెలిపారు. అదనపు జిల్లాజడ్జిలు షౌకత్ జహాన్ సిద్ధికి, శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయంకోసం న్యాయస్థానాలను ఆశ్రయించే న్యాయార్ధులకు అండగా న్యాయవ్యవస్థ నిలుస్తుందని అన్నారు. న్యాయసేవ సంస్థ లక్ష్యాలను, ఆశయాలను సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి వివరించారు. ప్రతి లోక్ అదాలత్ కు న్యాయవాదులు సంపూర్ణ సహాయ,సహకారాలు అందిస్తున్నారని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాసు చండక్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జిలు కుష్భు,గోపికృష్ణ,గవర్నమెంట్ ప్లీడర్ శ్రీహరి ఆచార్య, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యెండల ప్రదీప్, బార్ ఉపాధ్యక్షుడు ఆశ నారాయణ, సంస్థ ప్యానెల్ న్యాయవాదులు ప్రవీణ,మానస, రజిత,సదానండ్మానిక్ రాజు,జగన్ గౌడ్ ,ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. మొత్తం 7300 కేసులు పరిష్కారం…శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ దావాలు మొత్తం 7300 రాజీ పద్ధతిన పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి తెలిపారు. మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార దావాలలో రోడ్డు ప్రమాద బాధితులకు 4 కోట్ల 67 లక్షల 46 వేల 344 రూపాయలకు గాను అవార్డులు జారిచేశామన్నారు. “రోడ్డు ప్రమాద దావాలో 90 లక్షలకు అవార్డు” నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట నివాసి ప్యానెల్ గ్రేడ్ హెడ్ మాస్టర్ అల్లంరాజు భాస్కర్ రాజా రావు మోటారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దావా లో కోటి ముప్పై లక్షలకు నష్టపరిహారం కోరగా బాధిత కుటుంబ సబ్యులు,శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య రాజీ కుదిర్చి 90 లక్షల గాను అవార్డు ను జిల్లాజడ్జి సునీత, అదనపు జిల్లాజడ్జి కనక దుర్గ అందజేశారు.