– రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, ప్రజల భద్రతే ప్రధాన కర్తవ్యంగా పోలీస్ వ్యవస్థ నిర్విరామంగా పని చేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ, జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో చేపట్టిన సురక్ష దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్అండ్బీజిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ నుండి చేపట్టిన పోలీసుల వాహనల ర్యాలీని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఎంపి లు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు జెండా ఊపి ప్రారంభించారు. కాలేజ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై ఇల్లందు సర్కిల్, ఐటి హబ్, జిల్లా కోర్టు, ఇందిరా నగర్ సర్కిల్, మీదగా చెన్నై షాపింగ్ మాల్, జెడ్పీ సెంటర్, జమ్మి బండ, తుమ్మల గడ్డ, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, ప్రకాష్ నగర్ పోలీస్ కమాండ్ కంట్రోల్, బోస్ బొమ్మ సెంటర్, గ్రైన్ మార్కేట్, హర్కర బావి సర్కిల్, గణేష్ గంజ్, గాంధీ చౌక్, పి ఎస్ అర్ రోడ్, నయా బజార్, కాల్వోడ్డు, జూబ్లీ క్లబ్, మయూరి సెంటర్ మీదగా పాత బస్ స్టాండ్ వరకు భారీ పోలీస్ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా, నేరాలు, సైబర్ క్రైమ్ వంటి సాంకేతికతో ముడిపడి ఉన్న నేరాల వంటి సవాళ్ళను ఎదుర్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధమై ఉందన్నారు. మహిళల భద్రత విషయంలోనూ హౌం శాఖ పటిష్ట కార్యాచరణను అమలు చేస్తున్నదని అందుకు తగు ప్రణాళికలు చేసి విజయవంతంగా అమలు చేస్తున్నదన్నారు. జిల్లాలో పోలీస్ పని తీరు అద్భుతంగా ఉందని వారి సేవలను మంత్రి కొనియాడారు. పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సేవలను రాష్ట్రంలో పోలీస్ శాఖ అందిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ సేవ అనేది ప్రముఖమైందన్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించుకునేలా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించిదన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేలా ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ వహించారన్నారు. ఖమ్మం పోలీస్ కేరాఫ్ ఫ్రెండ్లీ పోలీస్కు చిరునామాగా నిలిచిందన్నారు.
జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించు కోవాలన్నారు. ముఖ్యంగా పోలీసు సురక్ష దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాల న్నారు. ఖమ్మం పోలీస్ లా అండ్ ఆర్డర్ను అదుపులో పెట్టిందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్ మేళాను నిర్వహించి ఖమ్మం పోలీస్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అయిందన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఖమ్మం పోలీస్…ఖమ్మం పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్…అనే తరహాలో ఖమ్మం పోలీస్ శాఖ ప్రజా సేవకై పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూ ఖమ్మం పోలీస్ శాఖ ర్యాలీకి ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తుంటే పోలీసు వ్యవస్థ ప్రజల్లో ఎంత నమ్మకం పెరిగింది అనేది ఇట్టే అర్థమయిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, , డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ విజరు కుమార్, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, శిక్షణ కలెక్టర్లు రాధికా గుప్తా, మయాంక్ సింగ్, డిఎఫ్ఓ సిదర్త విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ సుభాష్ చంద్ర బోస్, ఎసిపిలు రామోజీ రమేష్, గణేష్, సిఐలు స్వామి, శ్రీధర్, సత్యనారాయణ, అంజలి, శ్రీనివాస్, అశోక్, చిట్టిబాబు, ఎమ్టిఓ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐలు రవి, తిరుపతి, సింహాచలం సాంబశివ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.