మూడో రోజుకు చేరిన..మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

Navatelangana,Telugu News,Telangana,Rangareddy,– పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి
– మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు యెలామోని స్వప్న
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తమ సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనకు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎలమొని స్వప్న హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిన మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు చెల్లించడం లేదన్నారు. మేస్‌ ఛార్జీలు ఇవ్వకపోవడం, కోడిగుడ్డు బిల్లులు ఆరు నెలలుగా ఇవ్వడం లేదని వివరించారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ప్రభుత్వంలోకి రాకముందు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.10,000 వేతనాన్ని ఇస్తామని ప్రకటించిన సీఎం ఆ దిశగా ఇప్పటివరకు జీవో జారీ చేయలేదని అన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. గత ఆరు నెలలుగా నుంచి పేద పిల్లలకి వడ్డిస్తే ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతినెల ఐదు తారీకు లోపు జీతాలను చెల్లిస్తుందని కానీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి వంటలు చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం కండ్లు తెరిపించడం కోసం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నాలుగు రోజుల వరకు కొనసాగుతాయని ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజనాన్ని అప్పజెప్పే యోచనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత 22సంవత్సరాలుగా తమ జీవితాలను తాకట్టుపెట్టి పాఠశాలలో వండి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, గుర్తింపు కార్డు ఇవ్వాలని ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీఐటీయూ మున్సిపల్‌ కన్వీనర్‌ చింత పట్ల ఎల్లేశ, మండల కన్వీనర్‌ బుగ్గరాములు, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా నాయకురాలు శిరీష, రాధా, మధ్యాహ్న భోజన కార్మికులు మార్తా, నిర్మల, ప్రేమలత, పుష్ప, సుగుణమ్మ, పద్మ, రాములమ్మ, బాలమ్మ, జయామ్మ తదితరులు పాల్గొన్నారు.