గర్శకుర్తిని మండల కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు

 – మెజార్టీ సర్పంచ్ ల వెల్లడి
– ఉధృతమైన ఆందోళనలు..
– పెరిగిన మద్దతు
నవతెలంగాణ-గంగాధర : ప్రభుత్వం గర్శకుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసే వరకు శాంతియుత ఉద్యమం ఆపేది లేదని వివిధ గ్రామాల సర్పంచులు కంకణాల విజేందర్ రెడ్డి, వేముల దామెాదర్, హన్మంతరెడ్డి, అలువాల నాగలక్ష్మి-తిరుపతి, రామిడి కనుకమ్మ, ఎంపీటీసీ తడిగొప్పుల రజిత-రమేశ్, మాజీ సర్పంచులు కల్వకోట సవితాదేవి, కముటం రాజమల్లయ్య, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటి ఛైర్మన్ కల్వకోట శ్రీనివాసరావు వెల్లడించారు. గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో ఆ గ్రామ మండల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార 53 వ రోజుకు చేరుకోగా, నిరాహార దీక్షలో పాల్గొని ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్శకుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని సీఎంతో సహా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు హామీనిచ్చి అమలు చేయకపోవటం బాధాకరం అన్నారు. గర్శకుర్తితో పాటు పన్నెండు గ్రామాల ప్రజలు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. మండలంగా గుర్తిస్తే ప్రజలకు ఎంతో సౌలబ్యంగా ఉంటుందనే విషయం ప్రభుత్వం, పాలకులు గుర్తించాలని ప్రజాప్రతినిధులు సూచించారు. మండల కేంద్రం ఏర్పాటు కోరుతూ 53 రోజులుగా రిలే నిరాహార దీోక్షలు కొనసాగుతుండగా, గర్శకుర్తిని మండలంగా మార్చాలంటూ న్యాయవాధి, గర్శకుర్తి గ్రామస్తుడు దూస గౌరేశం ఇటీవల ఆత్మహత్యా యత్నం చేయడం ఉద్యమం ఉధృతికి నిదర్శమన్నారు. శాంతియుతంగా కొనసాగుతున్న మండల సాధన ఉద్యమం మరింత ఉధృతం చేసే వరకు ప్రభుత్వ ఉపేక్షించకుండా గర్శకుర్తిని మండలంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో తాడిజెర్రి వీడీసీ చైర్మన్ రామిడి సురేందర్, మాజీ ఎంపీటీసీ చిప్ప లావణ్య-చక్రపాణి, గర్షకుర్తి రైతు వేదిక సమన్వయ సమితి కమిటీ అధ్యక్షడు పల్లె మల్లిక్, ఉద్యమ నాయకులు బండారి శ్రీనివాస్, పుల్ల కొమురయ్య, నల్ల శ్రీనివాస్, నల్ల రాజేశం, మిట్టపల్లి గణేష్, మండల సాధన సమితి సభ్యులు పొత్తూరి సురేష్ అలువాల రాజేశం, అల్వాల భూమయ్య, శ్రీరామ్ శ్రవణ్, పోరెడ్డి లక్ష్మారెడ్డి, నెల్లి మహేష్, చిందం మురళి, శ్రీహరి, మిట్టపల్లి సత్తయ్య, చిందం భద్రయ్య, మోహిని, మల్లికార్జున్, రమేష్, శంకరయ్య, పుండరీకం, దూస లక్ష్మీనారాయణతో పాటు కాసారం, గట్టుభూత్కూర్, హిమ్మత్ నగర్, ఆచంపల్లి, చిన్నసంపల్లి, గర్షకుర్తి గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.