గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు

నవతెలంగాణ –  జమ్మికుంట
సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో జమ్మికుంట పట్టణ, మండల పరిధిలోని సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంతాలన్నీ  మారుమ్రోగాయి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం గ్రామ సమ్మక్క సారక్క గద్దెల వద్ద ,మండలంలోని తనుగుల, వావిలాల గ్రామాల్లోని సమ్మక్క సారక్క  గద్దెల వద్ద భక్తులు తమ మొక్కలను చెల్లించుకొని ,ఎత్తు బంగారాన్ని పంచిపెట్టారు . జాతర కువెళ్లే  దారులన్ని జనాలతో నిండిపోయాయి.  జాతరలో అతిముఖ్యమైన ఘట్టం గురువారం సాయంత్రం ఆవిష్కృతమైంది. వేలాది మంది భక్తుల పారవశ్యం, డప్పు చప్పుల మధ్యలో యువకుల నృత్యాలు, కోయదొరలు, శివసత్తుల పూనకాలు, పోలీస్ బందోబస్తు మధ్య బుధవారం సారలమ్మ ను  గురువారం కోయ పూజారులు వన దేవత సమ్మక్కను  గద్దెలపైకి చేర్చారు. దీంతో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు జనాలు బారులు తీరారు. పట్టణ సీఐ ఓ ర గంటి రవి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు నిర్వహించారు .శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సమ్మక్క సారలమ్మ తల్లులను గద్దెలపై దర్శించుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు జాతర జరిగే ప్రాంతాలకు రానుండడంతో జాతర జరిగే ప్రదేశాలన్నీ జన సంద్రోహంగా మారనున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆయా జాతర కమిటీ సభ్యులు తగు ఏర్పాట్లను చేపట్టారు.