– సీఎం రేవంత్కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
రాష్ట్రంలోని జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, కార్యదర్శులు ఎస్కె.సలీమ, బి.జగదీశ్వర్, ఈ.చంద్రశేఖర్ తదితరులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల ఇండ్లస్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అన్ని కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రుల్లో పనిచేసేలా కొత్త హెల్త్కార్డుల విధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అక్రిడిటేషన్ కార్డులను చూపిస్తే సచివాలయంలోకి అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ మీడియా అకాడమీలో అన్ని పత్రికల సంపాదకులను నియమించాలనీ, అలాగే జీవో 239 ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని యూనియన్లకు మీడియా అకాడమీ సభ్యత్వం కల్పించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మహిళా జర్నలిస్టులు, చిన్న, మధ్య తరహా పత్రికల సమస్యలను పరిష్కరించాలని సూచించారు . ఇందుకు స్పందించిన సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత జర్నలిస్టుల సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.