– ఎలక్ట్రిక్ వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
నవ తెలంగాణ-సూర్యాపేట
పెట్రోలియం ఉత్పత్తులు లభ్యం కావడం కష్టం గాను, అధిక ధరలు వుండడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాల మద్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలలో భాగంగా మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.బుధవారం స్థానిక రాయని గూడెం సమీపంలో ప్రముఖ వ్యాపారులు చల్లా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వోల్ట్రాన్ ఎలక్ట్రిక్ చార్జింగ్ హబ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం గాలి, నీరు, సూర్యరశ్మి నుండి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సిఎం కెసిఆర్, ఐటి పరిశ్రమల మంత్రి కెటిఆర్ ల క్ర్రషి తో తెలంగాణ రాష్ట్రములో నూతన పారిశ్రామిక విధానంలో పారిశ్రామిక వేత్తలకు సులభంగా అనుమతులు లభిస్తున్నాయని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు హైదరాబాదులో తమ సంస్ధలను నెలకొల్పుతున్నాయని, తద్వారా రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ చార్జింగ్ ఏర్పాటు చేయడంతో సూర్యాపేట పట్టణంలో పాత ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడం జరుగుతుందని మంత్రి అన్నారు. సూర్యాపేటలో ఎవరైనా పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టవచ్చని, వారికి తమ ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్ పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ ఎస్ నాయకులు గండూరి ప్రకాష్, బైరు వెంకన్న, జ్యోతి కరుణాకర్, ఉప్పల ఆనంద్, తోట శ్యామ్ ప్రసాద్, చల్లా లక్ష్మి కాంత్, చల్లా లక్ష్మి ప్రసాద్, బండారు రాజా, వోల్ట్రాన్ కంపెనీ ప్రతినిధులు రవిశంకర్, రాజా, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.