– నోటీసులు ఇవ్వకుండా పనులు చేపట్టడంపై ఆగ్రహం
– చేర్యాల పట్టణ కేంద్రంలో అఖిలపక్షం రాస్తారోకో
నవతెలంగాణ-చేర్యాల
రోడ్డు విస్తరణ పనులను ఇరువైపులా సమానంగా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారిపై సోమవారం వ్యాపారులతో కలిసి అఖిలపక్ష నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, బీజేపీ జిల్లా కార్యదర్శి బూరు సురేష్ గౌడ్ మాట్లాడారు. పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పట్టణ పరిస్థితులను, బిల్డింగ్ యజమానుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోకుండా, నోటీసులు జారీ చేయకుండా రోడ్డు విస్తరణ పనులు చేయడం సరికాదన్నారు. ఎలాంటి నోటీసులూ జారీ చేయకుండా.. అధికారులు, మున్సిపల్ కమిషనర్, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా రోడ్డుకు ఒక పక్క 38 ఫీట్లు, మరోపక్క 46 ఫీట్లు మార్కింగ్ చేస్తూ తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చి కాయకష్టం చేసి ఇండ్లు నిర్మించుకుని దుకాణ సముదాయాల్లో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. రోడ్డు వెడల్పులో నిబంధనలు పాటించి ఇరువైపులా సమానంగా విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరన్న, ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మల్లిగారి యాదగిరి, బీఎస్పీ మండల అధ్యక్షులు బుట్టి బిక్షపతి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి నారాయణ రెడ్డి, నాయకులు పోతుగంటి రాందాస్, ఈరి భూమయ్య, ముస్త్యాల రాజేష్, రాళ్లబండి నాగరాజు, పోలోజు శ్రీహరి, జంగిలి యాదగిరి వైశ్య సంఘం అధ్యక్షులు నీల శివకుమార్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు శేరి బాలనారాయణ, వైశ్య యువజన సంఘం అధ్యక్షులు ఐత సంపత్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ మంచాల కొండయ్య పాల్గొన్నారు.