కిమ్స్ కడల్స్ మహిళా ఆరోగ్య సదస్సులో
గవర్నర్ డాక్టర్ తమిళిసై
నవతెలంగాణ-సిటీబ్యూరో
కుటుంబంతో పాటు సమాజంలోనూ మహిళల పాత్ర ఎంతో కీలకమని, వారు బాగుంటేనే సమాజం ముందడుగు వేస్తుందని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలోని నోవోటెల్ హౌటల్లో ఆదివారం నిర్వహించిన మహిళా ఆరోగ్య సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మహిళలు తమ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలని చెప్పారు. ఆలస్యం చేసేకొద్దీ చిన్నది అనుకునే సమస్య చాలా పెద్దదైపోతుందని, అందువల్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. మన శరీరంలోని ప్రతి ఒక్క అవయవమూ ఎంతో ముఖ్యమైనదేనని, అన్నింటి పనితీరు విషయంలో మనం సరైన అవగాహన కలిగి ఉండాలని వివరించారు. భర్త, పిల్లలు, లేదా తల్లిదండ్రులు పట్టించుకుంటారులే అని వదిలేయడం సరికాదని మహిళలకు సూచించారు. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు.. ఇలా ఏ రంగంలోనైనా దూసుకుపోతున్న మహిళలు తమ ఆరోగ్యాన్ని లెక్కచేయడం లేదన్నారు. తర్వాత మహిళల ఆరోగ్యం కోసం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినందుకు డాక్టర్ కె. శిల్పిరెడ్డిని గవర్నర్ అభినందించారు. భవిష్యత్లోనూ ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అభిలాషించారు.
మహిళలను ఏకతాటిపైకి తీసుకురావడం, తమ ఆరోగ్యం గురించి నిపుణులను సంప్రదించే, ధైర్యంగా చర్చించే అవకాశాన్ని కల్పించడం ఉమెన్స్ హెల్త్ కాన్ క్లేవ్ లక్ష్యమని డాక్టర్ శిల్పిరెడ్డి అన్నారు. గర్భం, మెనోపాజ్, మానసిక ఆరోగ్యం, క్యాన్సర్ నివారణ లాంటి అనేక అంశాలపై నిపుణులు వివరించడంతో పాటు విభిన్న వర్గాల నుంచి హాజరైన మహిళలు ఆయా అంశాలపై చర్చించి, తమ సందేహాలను నివత్తి చేసుకున్నట్లు తెలిపారు. అనంరతం ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ డాక్టర్ తమిళిసైకి డాక్టర్ వి.సుధీర్ కతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో కిమ్స్ గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. భాస్కర్ రావు, కిమ్స్ ఆపరేషన్స్ హెడ్ అనిత, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి నియోనాటాలజిస్టు, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సి. అపర్ణ, ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకురాలు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గ్గా జి.రావు, కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ డెర్మటాలజిస్టు డాక్టర్ జానకి, కిమ్స్ ఆస్పత్రుల గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి.సుధీర్ తదితరులు పాల్గొన్నారు.