– ఆర్టీఐ కార్యకర్తకు ఎస్బీఐ స్పష్టీకరణ
– రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొన్నా..అధికారుల నిర్లక్ష్యతీరు
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల విక్రయాలు, బాండ్లను నగదు రూపంలోకి మార్చుకోవడానికి అనుసరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ), పద్దతులను వెల్లడించడానికి ఎస్బీఐ తిరస్కరించింది. వాణిజ్యపరమైన రహస్యాల కిందకు ఈ సమాచారం వస్తుందంటూ దాన్ని బహిర్గతం చేయడానికి నిరాకరించిందని ఆర్టీఐ సమాచారం తెలియచేసింది. బాండ్లకు సంబంధించి ఎస్బీఐ అధికారిక శాఖలకు జారీ చేసిన ఆదేశాలు, పద్దతుల వివరాలను తెలియచేయాల్సిందిగా కోరుతూ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద పారదర్శకత కోసం పోరాడే కార్యకర్త అంజలి భరద్వాజ్ దరఖాస్తు పెట్టుకున్నారు. దానిపై ఎస్బీఐ పై సమాధానం ఇచ్చింది.
2018 నుంచి ప్రతీసారీ బాండ్లకు సంబంధించి జారీ చేసిన ఆదేశాలన్నీ అంతర్గత ఆదేశాలని వాటిని కేవలం అంతర్గత పంపిణీ కోసమే ఉపయోగిస్తామని అంతేకానీ వాటిని వెల్లడించలేమని తెలిపింది. ఆర్టీఐ సెక్షన్ 8(1) (డి) కింద వాటికి మినహాయింపు వుంటుందని ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి కన్నబనాబు చెప్పారు. దీనిపై అంజలి భరద్వాజ్ స్పందిస్తూ, ఈ పథకమే రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అన్ని వివరాలను వెల్లడించాలని సుప్రీం ఆదేశించినప్పటికీ ఇంకా కీలక సమాచారాన్ని ఇవ్వడానికి ఎస్బీఐ తిరస్కరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.