సిగల్‌ వ్యవస్థ సరిగాలేకనే..

The sigal system is not working properly.– విజయనగరం రైలుప్రమాద ఘటన
– 13 మంది దుర్మరణం…
– ముమ్మరంగా సహాయక చర్యలు
– రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ
విజయనగరం : విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి సమీపాన ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. గాయపడిన వారు సుమారు 39 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో విజయనగరంలో 25 మంది, విశాఖలో 14 మంది చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. స్వల్పంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స చేసి ఇండ్లకు పంపించారు. కంటకాపల్లి-అలమండ మధ్య రైల్వే ట్రాక్‌పై ఆగి ఉన్న విశాఖ-పలాస పాసింజర్‌ రైలును, ఆ వెనుక వస్తున్న విశాఖ-రాయగడ పాసింజర్‌ రైలు ఢకొీన్న విషయం తెలిసిందే. పట్టాలు తప్పిన వీటి బోగీలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్సు రైలు బోగీలపైకి దూసుకెళ్లడంతో పట్టాలు పైకి లేచాయి. ఈ ప్రమాదంలో తొలిరోజే పది మంది మృతదేహా లను బయటకు తీసిన సహాయక బృందాలు, సోమవారం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో, మృతు ల సంఖ్య 13కు చేరింది. ఛిద్రమైన రైలు బోగీలను కట్‌ చేసి రాయగడ పాసింజర్‌ రైలు లోకో పైలట్‌ మృతదేహంతో పాటు మరో ఇద్దరి మృతదేహాలకు బయటకు తీశారు. సంఘటనా స్థలంలో 11 మంది మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో మరణించారు. మృతుల్లో విజయనగరం జిల్లావాసులే ఎక్కువ మంది ఉన్నారు. పలాస రైలు గార్డు ఎం.శ్రీనివాసరావు విశాఖ రైల్వే ఆస్పత్రిలో మతి చెందగా, టెక్కలి సుగుణమ్మ విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతదేహాలను విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. క్షత్రగాతులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.
ఇనుప చట్రాల మధ్య చిక్కుకున్న డ్రైవర్‌, లోకో పైలట్‌ మృతదేహాలు
రైలు ప్రమాదంలో బోగీలు ఛిద్రమవ్వడంతో ఇనుప ఛట్రాల మధ్య మృతదేహాలు చిక్కుకుపోయాయి. బోగీల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రాయగడ రైలు అసిస్టెంట్‌ డ్రైవర్‌ ఎస్‌.చిరంజీవి, లోకోపైలట్‌ సింగంపల్లి మధుసూదన రావు మృతదేహాలు ఇంజన్ల మధ్య చిక్కుకొని నుజ్జునుజ్జు అయ్యాయి. వారి మృతదేహాలను వెలికి తీయడానికి సహా యక బృందాలకు ఎక్కువ సమయం పట్టింది. లోకో పైలట్‌ శరీరం ఛిద్రం కావడంతో మాంసపు ముద్దలు బయటకు తీశారు. వీటిని గుర్తు పట్టేందుకు వీలులేని పరిస్థితి ఉంది.
ఆటో సిగల్‌ సిస్టంలో లోపం!
గతంలో రైలు కథలాలంటే స్టేషన్‌ నుంచి క్లియరెన్స్‌ వచ్చాకే రైలుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చేవారు. ఒకవేళ దాని ముందు మరో రైలు వెళితే, అది తరువాత స్టేషన్‌ చేరుకు న్నాక ఈ రైలుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చి వదిలే వారు. కానీ, ఆటో మోడ్‌ సిగల్‌ వచ్చాక, ఒకే లైనుపై రెండు రైళ్లను ఐదు నిముషాలు వ్యవధిలోనే గ్రీన్‌ సిగల్‌ ఇచ్చి వదులుతున్నారు. పలాస రైలుకు సిగల్‌ లోపం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కానీ, ఒఆర్‌ కేబుల్‌ కట్‌ అవడం వలన రైలు ఆగిపోయిందని కొందరూ చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిగితేనే అసలు విషయం తెలియనుంది
స్థానికుల చొరవతో తగ్గిన ప్రాణ నష్టం
రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాలైన అలమండ, కుద్దు పాలెం, నారాయణపురం, భీమాలి గ్రామాల ప్రజలు, యువ కులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయా ణికులను రక్షించారు. సంఘటనా స్థలం నుంచి క్షతగాత్రుల ను బయటకు తీశారు. సుమారు కిలోమీటరు వరకూ భుజా లపై మోసుకొని తీసుకెళ్లి అంబులెన్సుల్లో ఎక్కించారు. వాహ నాలు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కొమ్మలు, చెట్లు తొల గించి పోలీసు, రెవెన్యూ, ఇతర సహాయక బలగాలకు సహ కరించారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రాణపాయం నుంచి బయటపడ్డారని బాధితులు చెబుతున్నారు. మరో వైపు మహిళలు తాగునీరు, మజ్జిక వంటివి బాధితులకు అందించి సహాయక చర్యలు చేపట్టారు.
15 గంటల్లో లైన్‌ క్లియర్‌ యుద్ధప్రాతిపదికన ట్రాక్‌ పునరుద్ధరణ
ప్రమాదం జరిగినప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌డిఆర్‌ఎఫ్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు, సిఆర్‌ఫిఎఫ్‌ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున హాజరై యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బోగీలను ట్రాక్‌పై నుంచి తొలగించేందుకు భారీ క్రేనులు, ప్రొక్లయినరు వంటి వాటిని రైల్వే శాఖ ఉపయోగించింది. పట్టాలు తప్పిన బోగీలను పలాస రైలుకు సంబంధించి అలమండ స్టేషన్‌కు, రాయగడ రైలుకు సంబంధించి కంటకాపల్లి స్టేషన్‌కు తరలించారు. రైలు ప్రమాద ఘటన జరిగిన 15 గంటల్లో యుద్ధప్రాతిపదికన రైలు ట్రాక్‌ను పునరుద్ధరించారు. విజయవంతంగా ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు. ఈ పనులను రైల్వే శాఖ డిఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌, జిఎం మనోజ్‌ శర్మ పర్యవేక్షించారు. ట్రాక్‌ మరమ్మతుల్లో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన అరగంట వ్యవధిలోనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్‌, ఎస్‌పీ ఆదేశాలతో జిల్లాలోని పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఒడిశా నుంచి నాలుగు డిజాస్టర్‌ బృందాలు చేరుకోగా, 85 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది, 123 మంది ఎస్‌సిఆర్‌ ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విశాఖ, విజయనగరం వైద్య బృందాలు బాధితులకు చికిత్స అందించాయి. సహాయక చర్యలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మయూర అశోక పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
సిగల్‌ వ్యవస్థ సరిగా లేకే ప్రమాదం
బాధిత ప్రయాణికుల కథనం ప్రకారం… పలాస పాసింజర్‌ రైలు కంటకాపల్లి స్టేషన్‌ దాటిన వెంటనే అలమండ స్టేషన్‌ నుంచి రావాల్సిన గ్రీన్‌ సిగల్‌ బదులు పసుపు సిగల్‌ రావడంతో పలాస రైలు వేగం తగ్గించుకుని నెమ్మదిగా వెళ్తోంది. ఆ వెనుక వస్తున్న రాయగడ రైలుకు కంటకాపల్లిలో గ్రీన్‌ సిగల్‌ రావడంతో అది యథావిధిగా వేగంతో అదే లైను గుండా వెళ్లడంతో ముందున్న పలాస రైలును బలంగా ఢకొీంది. కానీ, అధికారులు మాత్రం… ఓవర్‌ హెడ్‌వైర్‌ తెగిపోవడంతో పలాస పాసింజర్‌కు సిగల్‌ లేక ఆగిపోయిందని, దీనివల్లే వెనుక వస్తున్న రాయ గడ రైలు ఢ కొట్టిందని చెప్తున్నారు. పూర్తి విచారణ జరిపితే తప్ప కారణం చెప్పలేమని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు.
విజయవాడ రైల్వే డివిజన్‌లో హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటు
విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోనూ అధికారులు హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. అనకాపల్లి; 08924-221698, తుని, 08854-252172, సామర్లకోట 0884-2327010, కాకినాడ టౌన్‌ 0884-2374227, రాజమండ్రి 0883-2420541, నిడదవోలు 0881-3223325, ఏలూరు 0881- 2232267, భీమవరం టౌన్‌ 0881-6230098, విజయవాడ 0866-2576924, తెనాలి 0864- 4227600, ఒంగోలు 08592 -2280308, నెల్లూరు 0861-2342028, గూడూరు 9494178434 నెంబర్లను రైల్వే శాఖ కేటాయించింది. ప్రయాణికులకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లను సంప్రదించాలని సూచించింది.