పార్టీకి పూర్వ వైభవమే లక్ష్యంగా జూలైలో టీడీపీ బస్సు యాత్ర

– త్వరలోనే షెడ్యూల్‌ : కాసాని జ్ఞానేశ్వర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలుగుదేశం పార్టీ పునర్‌ నిర్మాణం, పూర్వ వైభవమే లక్ష్యంగా జూలై మొదటి వారంలో బస్సు యాత్రను చేపట్టనున్నట్టు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకులతో రూట్‌మ్యాప్‌ ఖరారుపై చర్చించిన తర్వాత బస్సు యాత్ర షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌భవన్‌లో మల్కాజ్‌గిరి, మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో జ్ఞానేశ్వర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు ఎంతో దూరంలో లేవనీ, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చి గెలుపు కోసం శ్రమించాలని పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని అన్నారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారాక, అధికార పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత బాగా పెరుగుతున్నదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాల్లేవన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంతటా సమిష్టిగా కృషి చేస్తే బస్సుయాత్ర విజయవంతం అవుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర విజయవంతమైతే పార్టీకి మంచి ఊపు రావడం తథ్యమనీ, అది వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడుతుందన్నారు. వాస్తవానికి తెలంగాణలో టీడీపీ ఇప్పటికీ బలంగా ఉందన్నారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజా తీర్పును, క్యాడర్‌ నమ్మకాన్ని వమ్ము చేసి అధికార పార్టీలోకి ఫిరాయించి మోసం చేశారని విమర్శించారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్య నేతలు పార్టీని వీడటంతో కొన్నేండ్లుగా నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణులు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయని అన్నారు. తాను టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి 96 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారం భించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రవేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు నందమూరి సుహాసిని, సాయితులసి తదితరులు పాల్గొన్నారు.