ప్రజల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ లక్ష్యం

– షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
ప్రజల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌ అని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నందిగామ మండల పరిధిలోని అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, మొదళ్లగూడెం, మామిడిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మాట్లాడుతూ 65 ఏండ్ల కాలంలో తెలంగాణ ఎలాంటి అభివృద్ధి సాధించలేదని, గత పది సంవత్సరాలలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధికి దూరం అవుతుందని తెలిపారు. మరొక్కసారి అవకాశం ఇవ్వడం వలన మరింత అభివృద్ధి జరుగుతుందని వివరించారు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, మాజీ జడ్పీ చైర్మన్‌ నవీన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ మామిళ్లవిఠల్‌ తదితరులు పాల్గొన్నారు.