– బిల్లుకు మద్దతిచ్చినందుకు కేటీఆర్కు ధన్యవాదములు : పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమని అంబర్పేట్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం లభిస్తున్నదన్నారు. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించడం చరిత్రలో మర్చిపోలేనిదని అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నేత దుర్గాప్రసాద్ రెడ్డితో పాటుగా ప్రగతి భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను ఆమె కలిశారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కేటీఆర్కు ధన్యవాదములు తెలిపారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా మహిళలకు గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తోందన్నారు. మహిళా బిల్లు సాధన కోసం 27 ఏండ్ల పాటు నిరంతర పోరాటం కొనసాగిందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా కోటలో అంబర్పేట్ నియోజకవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని కేటీఆర్ను కోరగా సానుకూలంగా స్పందించినట్టు పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి తెలిపారు.