చాలా సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి

గోపీచంద్‌ నటిస్తున్న నయా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’.
ఎ హర్ష దర్శకుడు. శీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె కె రాధామోహన్‌ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు. ఈనెల 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత కె.కె.రాధామోహన్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
కొత్త జోనర్‌లో ఉండే కథ
మా సహ నిర్మాత శ్రీధర్‌ ద్వారా దర్శకుడు హర్ష ఈ కథని గోపీచంద్‌కి నెరేట్‌ చేశారు. ఆయనకి ఈ కథ చాలా నచ్చింది. ఈ కథలో చాలా కొత్త ఎలిమెంట్స్‌ ఉన్నాయి. గోపీచంద్‌ ఇంతకుముందు పోలీస్‌ పాత్రలు చేశారు కానీ ఈ పాత్ర చాలా డిఫరెంట్‌. చాలా కొత్త జోనర్‌లో ఉండే కథ ఇది. ప్రస్తుతం ప్రేక్షకులు ఇలాంటి కథలని గొప్పగా ఆదరిస్తున్నారు. తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకంతో ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టాం.
బ్రహ్మరాక్షసుడిగా కనిపిస్తారు
ట్రైలర్‌లో చూపించినట్లుగా ఇందులో గోపీచంద్‌ది బ్రహ్మరాక్షకుడి క్యారెక్టరైజేషన్‌గానే ఉంటుంది. అయితే కథలో సిట్చ్యువేషనల్‌ కామెడీ ఉంటుంది. అలాగే చిన్న లవ్‌ ట్రాక్‌ కూడా ఉంది. హీరోయిన్స్‌ ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ పాత్రలు డిఫరెంట్‌గా ఉంటాయి. పోలీస్‌ క్యారెక్టర్‌, మాళవిక శర్మ పాత్రల మధ్య ఓ ప్రేమకథ ఉంటుంది. ప్రియా భవానీ శంకర్‌ది పూర్తిగా భిన్నమైన పాత్ర. అది ఇప్పుడే రివీల్‌ చేేయకూడదు. చాలా పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ అది.
అఖండతో పోలిక లేదు
కథలో చాలా సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ట్రైలర్‌లో పోలీస్‌ కాకుండా గోపీిచంద్‌ మరో గెటప్‌ చూసి ప్రేక్షకులు చాలా ఎగ్జైట్‌ అవుతున్నారు. అది ఏమిటనేది ఈనెల 8న తెలుస్తుంది. అయితే ఫాంటసీ ఎలిమెంట్స్‌, గోపీచంద్‌ సెకండ్‌ లుక్‌ చూసి ‘అఖండ’తో పోలిస్తున్నారు. దానికి దీనికి ఏ మాత్రం పోలిక లేదు. ఇందులో చూపించిన పరశురామక్షేత్రం బెంగళూరు, బాదామి పరిసరప్రాంతాల్లో ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. శివాలయం, అఘోరాలను యాంబియన్స్‌ కోసం చూపించాం. అఘోరాలకు కథతో సంబంధం లేదు. హర్ష కన్నడలో పేరుపొందిన దర్శకుడు. తనని తెలుగులో పరిచయం చేయడం ఆనందంగా ఉంది. హర్ష చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. తను కొరియోగ్రఫర్‌ కూడా. మా ‘బెంగాల్‌ టైగర్‌’ సినిమాకి చేశారు. ఈ సినిమాని అద్భుతంగా తీశారు. అలాగే ఇందులో రెండు పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారు. గోపీచంద్‌ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్‌ రిలీజ్‌. ఓటీటీ, శాటిలైట్‌ బిజినెస్‌ కూడా క్లోజ్‌ చేశాం.

అయుష్‌ శర్మ హీరోగా ఒక హిందీ సినిమా జరుగుతోంది. ఏప్రిల్‌ 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌, విజరు కనకమేడల కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది.
– నిర్మాత కె.కె.రాధామోహన్‌