– ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : సీఎస్ శాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉన్నందున ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ద్వారా సమీక్షించారు. రాష్ట్ర పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ శాఖ డైరెక్టర్ దివ్య, జలమండలి ఎండి సుదర్శన్ రెడ్డి తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే ”సమ్మర్ యాక్షన్ ప్లాన్” ను రూపొందించి జిల్లాలకు తగినన్ని నిధులను విడుదల చేశామని తెలిపారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తయ్యాయని చెప్పారు. నిర్వహణ పరమైన లోపాలను ఎప్పటికప్పుడు వెంటనే సవరించి నిరంతర నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతీ రోజు గ్రామాలు, పట్టణాలలో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంజూరు చేసిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా ఆపరేషన్, మెయింటెనెన్స్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లో ఎదురవుతున్న తాగునీటి సమస్యను మన రాష్ట్రానికి కూడా అన్వయిస్తూ పత్రికల్లో ఆందోళనకరమైన వార్తా కథనాలు వస్తున్నాయని సీఎస్ ఈ సందర్బంగా తెలిపారు. అయితే రాష్ట్రంలో ఈసారి లోటు వర్షపాతం ఉన్నా, ఇక్కడి ప్రధాన జలాశయాలు ఎస్ఆర్ఎస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, నాగార్జున సాగర్లలో గతేడాది మాదిరిగానే నీటి మట్టాలున్నాయని వివరించారు. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కొన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో నిర్వహణపరంగా లోపాలొచ్చాయనీ, వీటిని వెంటనే పరిష్కరించాలని వివరించారు. . నీటి సమస్యలపై వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే వార్తలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.
ఏప్రిల్ రెండో వారం అనంతరం రిజర్వాయర్ల నుండి ఎమర్జెన్సీ పంపింగ్ను చేపడతామని శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలో కూడా సరిపడా నీటిని సరఫరా చేస్తున్నామనీ, అయితే, కమర్షియల్ అవసరాల నిమిత్తం డిమాండ్ ఎక్కువగా ఉందని జలమండలి అధికారులు తెలిపారు.