ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ‘ఉపాధి’ కూలీలు
– కేంద్రం విధానంతో ఇబ్బందులు
– పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కరువు
– మౌలిక వసతులపై దృష్టిసారించని యంత్రాంగం
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కాసేపు సేద తీరేందుకు నీడ.. తాగేందుకు నీళ్లూ ఉండటం లేదు. పెరుగుతున్న ఎండ తీవ్రతతో కూలీలు అల్లాడుతున్నారు. కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. ఇండ్ల నుంచే తాగునీరు పట్టుకెళ్లాల్సిన దుస్థితి. అవి అయిపోతే దప్పికతో ఇబ్బందులు పడాల్సిందే. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కూలీలు పని చేసే ప్రాంతాలవైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. కొలతల్లో తేడాలుంటున్నాయని డబ్బుల్లో కోత విధిస్తున్న అధికారులు.. చట్టపరంగా వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై మాత్రం దృష్టిసారించడం లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉపాధి కూలీలు వడదెబ్బ బారినపడుతున్నారు. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైతే ప్రాథమిక వైద్యం కూడా అందని పరిస్థితి.
వేసవి కావడంతో ఉపాధిహామీలు పనులు ఊపందుకున్నాయి. మరోపక్క కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం రెండు సార్లు కూలీల ఫొటోలు తీసుకొని యాప్లో అప్లోడ్ చేయాల్సి వస్తోంది. అలా అయితేనే కూలీలకు రోజువారీ పూర్తి వేతనం అందుతుంది. దీంతో కూలీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని ప్రదేశంలోనే ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో తప్పనిసరిగా ఆయా ప్రదేశాల్లో తాగునీరు, నీడ కోసం టెంట్, ప్రాథమిక చికిత్స పెట్టే తదితర సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేకంగా మెట్లకు బాధ్యతలు అప్పగించేవారు. రెండేండ్ల కిందట కొంత వరకు ఈ సౌకర్యాలు బాగానే అమ లైనా.. క్రమక్రమంగా ఈ చట్టానికి కేంద్రం నిధుల్లో కోతలు విధిం చుకుంటూ పోతుం డటంతో.. సౌక ర్యాలు కుచించుకు పోతు న్నాయి. పర్యవేక్షిం చాల్సిన గ్రామీణా భివృద్ధి శాఖ అధికారులు పట్టిం చుకోక పోవడం.. ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించకపోవడం మూలంగా కూలీలు అవస్థలు పడుతున్నారు.
పిట్టల్లా రాలుతున్న కూలీలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఉగ్ర రూపం దాల్చుతు న్నాయి. రాష్ట్రంలోనే జిల్లాలో అత్య ధిక ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. ఈ క్రమంలో ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కరువ య్యాయి. మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో రోజువారీ కూలీ పనులు చేసుకొని జీవించే పేదలకు ఉపాధిహామీ పనులే కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాయి.
ఎండ తీవ్రత ఉన్నప్పటికీ పనికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు సుమారు ఐదు నుంచి పది మంది వరకు వడదెబ్బ కారణంగా మృతిచెందారు. రెండు రోజుల కిందట ఉట్నూర్కు చెందిన సురేష్ ఉపాధిహామీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగిరాగానే అస్వస్థతకు గురై మృతిచెందాడు.
ఇప్పటికే ఆయా మండలాల్లో పలువురు మరణించిన సంఘటనలు ఉన్నాయి. ఎండలో పనిచేస్తూ అనేక మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
నిలిచిపోయిన అదనపు భత్యం..!
ఉపాధిహామీ పనుల కోసం అవసరమైన పరికరాలను ప్రభుత్వం ఇది వరకు సరఫరా చేసింది. గడ్డపారలు, పారలు, ఇనుప తట్టలు, గొడ్డళ్లు, కొడవళ్లను సైతం అందించింది. క్రమంగా వాటి సరఫరా నిలిపివేయడంతో కూలీలే సొంతంగా ఆయా పరికరాలను సమకూర్చుకుంటున్నారు. తాగునీటి కోసం గతంలో కూలీలకు రూ.5 చెల్లించేవారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లో పనిచేసే కూలీలకు 20శాతం అదనపు భత్యం కూడా చెల్లించేవారు. కానీ కేంద్రం ఇటీవల నూతన సవరణలు తీసుకొచ్చి ఈ రెండు ప్రయోజనాలను నిలిపివేసింది. దీంతో కనీస సౌకర్యాలు లేకపోవడం.. ప్రయోజనాలు దూరం కావడంతో కూలీలు సైతం పనులకు వెళ్లేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ఉపాధి కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టేందుకు కారణమవుతోంది.
ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు
ఉపాధిహామీ పని ప్రదేశంలో ఎలాంటి సౌకర్యాలూ కల్పించడం లేదు.
ఉదయం పనులకు వెళ్తే సుమారు నాలుగు గంటలు ఎండలోనే పనిచేయాల్సి వస్తోంది.
తాగునీరు, టెంట్, ప్రాథమిక చికిత్స పెట్టే కూడా ఉండటం లేదు. ఇంటి నుంచే తాగునీటిని తీసుకెళ్తున్నాం.
ఇప్పటికైనా అధికారులు స్పందించి పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి.
– కేంద్రె గజానంద్, తాడిహత్నూర్