సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి రాబోతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ప్రధాన పాత్రలు పోషించారు. హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతుండగా, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పిస్తున్నారు. నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘మ్యాడ్’ గ్యాంగ్ని పరిచయం చేస్తూ మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు చిత్రం బందంతో పాటు, ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ సహా పలువురు హాజరయ్యారు. ఈ సినిమాలో అనుదీప్ కూడా నటించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘దర్శకుడు కళ్యాణ్ ఎప్పుడూ మంచి కథలు రాస్తుంటాడు. ఈ సినిమా చాలా ఎనర్జీతో, చాలా హ్యూమర్తో ఉంటుంది. కొత్తవాళ్ళని ప్రోత్సహిస్తూ నాగవంశీ మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. మీరందరూ థియేటర్లలో ఈ సినిమాని చూసి ఎంజారు చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
”జాతిరత్నాలు’ కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే.. టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం. సినిమా పట్ల అంత నమ్మకం ఉంది. ఇది యూత్ ఫుల్ సినిమా అయినప్పటికీ, కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ని గుర్తు చేయడానికి తీసిన సినిమా ఇది. లాజిక్కులు, ట్విస్ట్లు ఏముండవు. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు నవ్వుతూనే ఉంటారు’ అని నిర్మాత నాగవంశీ చెప్పారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో మ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. నిర్మాత హారిక స్క్రిప్ట్ దశ నుంచి షూటింగ్ వరకు మొత్తం దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంటే ఉంటుంది. వంశీ చెప్పినట్టు మీకు డబ్బులు వెనక్కి రావు. అంతలా ఎంజారు చేస్తారు’ అని అన్నారు.