నవ్వుతూనే ఉంటారు

నవ్వుతూనే ఉంటారుసూర్య తేజ హీరోగా పరిచయం అవుతూ నటించిన చిత్రం ‘భరతనాట్యం’. ‘దొరసాని’ ఫేమ్‌ కెవిఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్‌ ఫిలింస్‌ పతాకంపై పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. వేసవి కానుకగా ఈనెల 5న విడుదలకు కానుంది. ఈ నేపథ్యంలో హీరో ఆనంద్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా మేకర్స్‌ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్‌ శివాత్మిక, జీవిత రాజశేఖర్‌, నవదీప్‌, దర్శకులు శ్రీరామ్‌ ఆదిత్య, విరించి వర్మ, నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్‌, మధుర శ్రీధర్‌, లగడపాటి శ్రీధర్‌ పాల్గొన్నారు. హీరో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ, ‘భరతనాట్యం’ చాలా ఆసక్తికరమైన కథ. వివేక్‌ సాగర్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ‘దొరసాని’ సినిమా మా అందరికీ చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దర్శకుడు కెవిఆర్‌ మహేంద్ర, నేను, శివాత్మిక.. ఇలా దాదాపు అందరం కొత్తవాళ్లతో ఆ సినిమా చేశాం. ఆ సినిమా మా అందరి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ఇదే నమ్మకంతో చెబుతున్నా… ఈ సినిమా కూడా సూర్య తేజతో పాటు సినిమా యూనిట్‌ అందరికీ చాలా మంచి పేరు తీసుకొస్తుంది’ అని అన్నారు. ‘ఒక సినిమా అవ్వాలంటే నేచర్‌ సపోర్ట్‌ చేయాలని మా దర్శకుడు చెప్పేవారు. మా సినిమాకి ఆ నేచర్‌ హితేష్‌. ఆయన వలనే ఈ సినిమా సాధ్యపడింది. మాపై చాలా నమ్మకంతో ఈ సినిమా చేశారు. మహేంద్ర సినిమాని అద్భుతంగా తీశారు. ఇందులో ఆయనలోని వైలెన్స్‌ని చూస్తారు’ అని హీరో సూర్య తేజ ఏలే చెప్పారు. దర్శకుడు కెవిఆర్‌ మహేంద్ర మాట్లాడుతూ,’ఈ సినిమాని చాలా ఎంటర్‌టైనింగ్‌ హ్యుజ్‌ వరల్డ్‌ క్రియేట్‌ చేసి చెప్పడం జరిగింది. సినిమా మొదలైన ఐదు నిమిషాల తర్వాత ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఈ సినిమా ఆద్యంతం కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. డార్క్‌ కామెడీ హిలేరియస్‌గా వర్కవుట్‌ అయ్యింది’ అని అన్నారు.